Adulterated Milk : తూర్పుగోదావరి జిల్లాలో కల్తీ పాల కలకలం…నలుగురు మృతి

రాజమహేంద్రవరంలో కల్తీ పాలు కలకలం. పాలు సేవించి నలుగురు మృతి, చిన్నారులు సహా పలువురు ఆసుపత్రిలో చికిత్స. ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.

Rajamahendravaram adulterated milk deaths

అమరావతి : ఏపీ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్ర వరంలో కల్తీ పాలు కలకలం రేపాయి. కల్తీ పాలు వినియోగించిన వారిలో నలుగురు మృతి చెందారు. మృతుల్లో దివాన్ చెరువుకు చెందిన మంచి రాధాకృష్ణమూర్తి(74), లాలా చెరువు ప్రాంతానికి చెందిన యాళ్ళ శేషగిరిరావు(72), చౌడేశ్వరి నగర్ కు చెందిన తాడి కృష్ణవేణి(75) , లాలా చెరువు చెందిన కనక రత్నం(76) మృతి చెందారు. రాజమండ్రి పిల్లల ఆసుపత్రిలో మరో నలుగురు చిన్నారులు చికిత్స పొందుతున్నారు. వారిలో సీరియస్ కండిషన్ లో ఉన్న ఇద్దరు చిన్నారులకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. బాధితుల్లో ఎక్కువ మంది 60 ఏళ్లు పైబడినవారే కాగా 5 నెలల శిశువు, మూడేళ్ల బాలుడు కూడా ఉన్నారు. ఈ నెల 15 తర్వాతి నుంచి వాంతులవడం, మూత్రవిసర్జన కాకపోవడం, పొట్ట ఉబ్బడం తదితర సమస్యలతో ఒక్కొక్కరుగా 14 మంది ఆసుపత్రిలో చేరారు. వారంతా పాల కల్తీతో కిడ్నీ సమస్యలకు గురైనట్లుగా అనుమానిస్తున్నారు.

ఆసుపత్రుల పాలైన బాధితులందరికీ ఒకే వ్యక్తి పాలు పోస్తుండటంతో పాల కల్తీ జరిగి ఉండొచ్చని వైద్యాధికారులు, బాధితులు పోలీసులకు తెలిపారు. శివరాత్రి (15వ తేదీ) రోజు పాలు, పెరుగు చేదుగా అనిపించాయని కొంతమంది బాధితులు చెప్పార అని, వారికి కోరుకొండ మండలానికి చెందిన గణేష్‌ అనే వ్యాపారి పాలు పోస్తున్నట్లు గుర్తించడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. బాధితుల నుంచి సేకరించిన రక్త, మూత్ర నమూనాలను టాక్సికాలజీ పరీక్షకు పంపించారు. ఆ నమూనాల నివేదికలు రావాల్సి ఉంది.

రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష

రాజమహేంద్రవరం చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్ కల్తీ పాలన ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, వైద్యారోగ్య శాఖ అధికారులతో ఆయన సమీక్ష చేసి.. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. పాల నమూనాల పరీక్షల ఫలితాలు వచ్చాక విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాంచారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు తక్షణమే రాజమహేంద్రవరం వెళ్లాలని సూచించారు.

ఇవి కూడా చదవండి :

Supreme Court : కల్తీ నెయ్యి వివాదంలో సుప్రీంకోర్టులో ఏపీకి ఊరట!
Nepal bus accident| నదిలో పడిన బస్సు..18మంది మృతి

Latest News