Ex-IAS Praveen Prakash : హీరోగా ఉన్న నేను.. ఒక్క తప్పుతో విలన్ గా మారిపోయాను

ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్ తాను చేసిన తప్పులకు క్షమాపణ చెబుతూ వీడియో విడుదల చేశారు. హీరోగా ఉన్న తాను ఒక్క తప్పుతో విలన్‌గా మారానని తెలిపారు.

Reported by: Tejaswini Nanna | ఆంధ్ర ప్రదేశ్ | Nov 12, 2025, 6:44 pm IST
Read Time: 4 mins
Ex-IAS Praveen Prakash : హీరోగా ఉన్న నేను.. ఒక్క తప్పుతో విలన్ గా మారిపోయాను

అమరావతి : వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో తాను చేసిన తప్పులకు సారీ చెబుతూ రిటైర్డు ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేశారు. ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్, ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావుకు బహిరంగ క్షమాపణలు చెప్పారు. సర్వీసులో ఉండగా వారిపట్ల తాను అనుచితంగా ప్రవర్తించానని, అందుకు చింతిస్తున్నానని వీడియోలో పేర్కొన్నారు.

ఆయన వీడియోలో మాట్లాడుతూ.. గతేడాది సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్‌కు గురయ్యాను. ఏం తప్పు చేశాననే అంశంపై తీవ్రంగా ఆలోచించానన్నారు. 30 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్‌లో పనిచేశానని.. నా సర్వీస్‌లో ఒక్క రూపాయి కూడా అక్రమంగా సంపాదించలేదు.. చట్టానికి విరుద్ధంగా ఏనాడూ ప్రవర్తించలేదు.. 2000-2004 వరకు గుంటూరు, విజయవాడలో మున్సిపల్ కమిషనర్‌గా పనిచేశా.. గుంటూరు, విజయవాడకు చేసిన సేవలు నన్ను హీరోని చేశాయి, కానీ.. ఒక్క తప్పుతో హీరోగా ఉన్న నేను విలన్‌గా మారిపోయి.. సమాజం పెట్టిన టెస్టులో నేను ఫెయిల్ అయ్యాను. తప్పు చేశాననే భావనతోనే వీఆర్ ఎస్ కు అప్లయ్ చేశానని చెప్పుకొచ్చారు. 2020లో ఏపీ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశానని.. నాకంటే ఐదేళ్లు సీనియర్ ఐపీఎస్ అధికారి అయినటువంటి ఏబీవీ పై వచ్చిన ఆరోపణలపై సివిల్ సర్వీసెస్ రూల్స్ ప్రకారం డీజీపీకి చర్యల కోసం రాశానన్నారు. అదే విధంగా కృష్ణకిషోర్ విషయంలో స్పందించానన్నారు. అయితే నైతికంగా మాత్రం వారి విషయంలో ఫెయిలయ్యానన్నారు. అందుకు చింతిస్తున్నట్లు పేర్కొన్నారు.