విధాత: రాష్ట్రంలోని 35 పట్టణ స్థానిక సంస్థల ప్రత్యేకాధికారుల పదవీ కాలాన్ని 6 నెలలపాటు పొడిగిస్తూ పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీ చేసింది.వీటిల్లో కొందరు స్పెషల్ ఆఫీసర్ల పదవీ కాలం ఈ ఏడాది ఏప్రిల్లో ముగియగా, ఇంకొందరికి జూన్, జూలై, ఆగస్టులలో ముగిసింది.
వీటితోపాటు 9 నగర పాలక సంస్థలకు ప్రత్యేకాధికారులను నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి.తాడేపల్లిగూడెంకు పశ్చిమ గోదావరి జిల్లా జేసీ (రెవెన్యూ) అంబేడ్కర్, భీమవరానికి జేసీ (అభివృద్ధి) శుక్లా, వైఎస్సార్ తాడిగడపకు గుడివాడ ఆర్డీవో, దాచేపల్లికి వినుకొండ ఆర్డీవో, గురజాలకు గుంటూరు జిల్లా ‘డ్వామా’ పీడీ, దర్శికి ప్రకాశం జిల్లా జేసీ (ఆసరా), పొదిలికి మార్కాపురం ఆర్డీవో, నెల్లూరు జిల్లాలోని గూడూరుకు గూడూరు ఆర్డీవో, పెనుకొండకు అనంతపురం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శివయ్యలను స్పెషల్ ఆఫీసర్లుగా నియమిస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులిచ్చింది.