విధాత: గత రెండేళ్లుగా రాష్ట్రంలో బీసీల సామాజిక, ఆర్థిక అభివృద్ధి ప్రశ్నార్థకమైందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. అనాదిగా కులవృత్తులపై ఆధారపడిన వారి ఎదుగుదల దెబ్బతిందని ధ్వజమెత్తారు. బీసీ సంక్షేమం- కుల వృత్తులు, చేతివృత్తుల వారి ప్రయోజనాలను కాపాడాలని కోరుతూ ముఖ్యమంత్రి జగన్కు ఆయన లేఖ రాశారు. మత్స్యకారుల ఉనికికి గొడ్డలిపెట్టులా ఉన్న జీవో నెం.217ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. చెరువులు, కాలువలు, రిజర్వాయర్లపై పూర్తి హక్కులను మత్స్యకార సొసైటీలకే అప్పగించాలని తేల్చి చెప్పారు. చేపల వేటే ప్రధాన వృత్తిగా జీవనం సాగించే మత్స్యకారులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం.. వారి వృత్తిని, జీవనాన్ని నాశనం చేసేలా తీసుకొచ్చిన జీవోను తెదేపా తీవ్రంగా వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు.
నిధులు, విధులు లేని కార్పొరేషన్ల ఏర్పాటుతో ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోందని.. రెండేళ్లలో కార్పొరేషన్లు, ఫెడరేషన్ల ద్వారా రూపాయి రుణం ఇవ్వలేదని దుయ్యబట్టారు. కొత్త ఉపాధి అవకాశాలూ కల్పించలేదని మండిపడ్డారు. బీసీ సబ్ ప్లాన్ను నిర్వీర్వం చేశారని అగ్రహం వ్యక్తం చేశారు. గత రెండేళ్లలో మత్స్యకారులకు సబ్సిడీ పథకాలు అందించడం లేదని.. తుపాన్లతో నష్టపోయిన వారికి ఎలాంటి భరోసా ఇవ్వలేదని విమర్శించారు. మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపడాలంటే ప్రభుత్వం తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేశారు. సొసైటీలను నిర్వీర్యం చేస్తూ మత్స్యకారుల్ని రోడ్డున పడేసేలా వ్యవహరించడం సరికాదని హెచ్చరించారు. దేశానికే ఆక్వా హబ్గా నిలవాల్సిన రాష్ట్ర మత్స్యరంగం.. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, విధానాలతో ప్రశ్నార్థకమైందని ఆవేదన వ్యక్తం చేశారు. చెరువులు, రిజర్వాయర్ల వంటి నీటి వనరుల్లో చేపలు పెంచుకునే హక్కులు మత్స్యకార సొసైటీలకే ఉండేలా చూడాలని సూచించారు