అమరావతి : ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులో మూడో ప్రపంచ తెలుగు మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో గుంటూరులోని సత్యసాయి ఆధ్యాత్మిక నగరిలో తెలుగు మహాసభలకు శ్రీకారం చుట్టారు. మహాసభలను అన్నమయ్య కీర్తనల సహస్ర గళార్చన మధ్య సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం శ్రీనరసింహ, విశ్వయోగి విశ్వంజీ, ఏపీ శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు, గుంటూరు మేయర్ కోవెలమూడి రవీంద్రలు ప్రారంభించారు. మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు నేటి నుంచి మూడురోజులపాటు జరగనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు భాషాభిమానులు, సాహితీవేత్తలు ఈ సభలకు తరలివచ్చారు. తెలుగు భాషా వైభవం..భాష, సాహిత్య సౌరభాలను దశదిశలా వ్యాపింపచేసేందుకు ఈ మహాసభలు వేదికగా నిలువనున్నాయి.
ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ మహాసభలకు అధ్యక్షత వహించి మాట్లాడారు. తెలుగు భాష ప్రభుత్వానికి అధికార భాష, మాకు మాత్రం మమకార భాష అని పేర్కొన్నారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు తరఫున మూడోసారి ప్రపంచ మహాసభలు నిర్వహిస్తున్నామని గుర్తు చేశారు. 2వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ప్రాచీన భాష తెలుగు భాషకు నన్నయ్య, తిక్కన, ఎర్రన వంటి వారు పట్టం కట్టారని కీర్తించారు. ఎన్టీఆర్, రామోజీరావు తెలుగుకు గుర్తింపు తెచ్చిన వారిలో ప్రముఖులు అని కొనియాడారు.
సభలలో ప్రధాన వేదిక ముందు ఏర్పాటు చేసిన రామోజీరావు హస్తకళల ప్రాంగణంలో తెలుగు భాష ప్రాచీనత్వాన్ని చాటేలా పురాతన సాహిత్యం, ప్రాచీన నాణేలు, తెలుగు సంప్రదాయ వంటకాల ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ సభల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆంధ్రశ్రీ పూర్ణకుంభ పురస్కారాలు, సారస్వత సేవా పురస్కారాలు, జీవన సాఫల్య పురస్కారాలను.. పురస్కార గ్రహీతలకు నిర్వాహకులు ప్రదానం చేయనున్నారు. సాయంత్రం ఆంధ్ర శ్రీ పూర్ణకుంభ పురస్కారాల సభకు ముఖ్య అతిథిగా ఒరిస్సా గవర్నర్ కంభంపాటి హరిబాబు హాజరు కానున్నారు. మహాసభలలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి.హెచ్.మానవేంద్రనాథ్రాయ్, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, విశ్వహిందీ పరిషత్తు సభ్యులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి పాల్గొననున్నారు.
ఇవి కూడా చదవండి :
China former mayor corruption| చైనా మాజీ మేయర్ ఇంట్లో.. టన్నుల కొద్దీ బంగారం, నగదు నిల్వలు
KKR Mustafizur removal| ఐపీఎల్ నుంచి బంగ్లా ఆటగాడిని తప్పించండి : బీసీసీఐ
