విధాత:బచావత్ ట్రైబ్యునల్ ప్రకారం కృష్ణా నదికి తుంగభద్ర నుంచి 31.45 టీఎంసీలు రావాలి. అందులో సుంకేశుల బ్యారేజీ నుంచి 21 టీఎంసీలు, హంద్రీ నది నుంచి 10.45 టీఎంసీలు ఇవ్వాలి. వాస్తవంగా తుంగభద్ర నుంచి కృష్ణాకు ఏటా సగటున 150 టీఎంసీలకు పైగా వరద చేరుతోందని సాగునీటి నిపుణులు చెబుతున్నారు. సుంకేశుల ఎగువన కేసీ కెనాల్కు కేటాయించిన 29.90 టీఎంసీల్లో 20 టీఎంసీల నిల్వకు వీలుగా గుండ్రేవుల జలాశయం నిర్మాణానికి గత ప్రభుత్వం నిధులు కూడా మంజూరు చేసింది. ఈ రిజర్వాయరును నిర్మించి.. సర్ప్లస్ వియర్ నుంచి కుడి వరద కాలువ తవ్వాలి.. ఆ కాలువపై కర్నూలు జిల్లా మిడుతూరు వద్ద 7-10 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మించాలి. అక్కడి నుంచి కడప జిల్లా కొండాపురం మండలం గండికోట ఎగువన పెన్నాలో కలపవచ్చు. ఎత్తిపోతల పథకాలు అవసరం లేకుండా గ్రావిటీ ద్వారానే నీటిని మళ్లించవచ్చని.. కర్నూలు, కడప, నెల్లూరు జిల్లాలకు సాగు, తాగునీటిని ఇవ్వొచ్చని సాగునీటి నిపుణులు చెబుతున్న సూచనలు ఇప్పటికైనా జగన్ ప్రభుత్వం అమలు చేస్తే బావుంటుంది.