ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు : సీఎం రేవంత్రెడ్డి

- రూ.22,500 కోట్లతో 4.50 లక్షల ఇళ్ల నిర్మాణం
- పేదల ఆత్మగౌరవ ప్రతీకలు ఇందిరమ్మ ఇళ్లు
- డబుల్ బెడ్రూం ఇళ్లు ఉన్న ఊళ్లో కేసీఆర్,
- పీఎం ఆవాస్ యోజన ఇచ్చిన చోట బీజేపీ ఓట్లు అడగాలి
- ఇందిరమ్మ ఇళ్లు ఉన్న గ్రామాల్లో మేం ఓట్లు అడుగుతాం
- ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
భద్రాచలం: తెలంగాణ వ్యాప్తంగా రూ.22,500 కోట్లతో నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. పేదలు ఆత్మగౌరవంతో బతకాలనే ఆలోచనతో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రతి శాసనసభ నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. సోమవారం భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో పూజల అనంతరం వ్యవసాయ మార్కెట్ కమిటీ గ్రౌండ్లో ఇందిరమ్మ ఇళ్లు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ భద్రాచలంలో భద్రాద్రి రాముని సాక్షిగా, ఆయన ఆశీర్వాదం తీసుకొని ఇందిరమ్మ ఇళ్లు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. పేద ప్రజల చిరకాల కోరిక, ప్రతి దళిత, గిరిజన, బడుగు, బలహీన, మైనారిటీ వర్గాల ఆత్మగౌరవం ఇందిరమ్మ ఇళ్లు అని ముఖ్యమంత్రి అభివర్ణించారు. పేదవాళ్లు గ్రామాల్లో ఆత్మగౌరవంతో బతకాలి, పది మందిలో తలెత్తుకొని నిలబడాలంటే ప్రతి పేదవానికి ఇల్లు ఉండాలని ఆలోచించి నాటి కాంగ్రెస్ ప్రభుత్వం లక్షలాది ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇచ్చిందని గుర్తు చేశారు. తెలంగాణలో ప్రజా పాలన వచ్చిన తర్వాత భద్రాచలం పట్టణంలో ఆడబిడ్డల ఆశీర్వాదంతో ఇందిరమ్మ ఇళ్లు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఇల్లాలి ముఖంలో సంతోషం ఉంటే ఆ ఇల్లు బాగున్నట్లేనని, ఇంటి పెత్తనం తమ చేతిలో ఉంటే దానిని చక్కదిద్దే బాధ్యత ఆడ బిడ్డ తీసుకుంటుందని ముఖ్యమంత్రి అన్నారు. ‘ఇందిరమ్మ ఇళ్లు ఆడ బిడ్డల పేరుపై మంజూరు చేస్తాం. ఇంటి పట్టా ఆడ బిడ్డల పేరుపై ఉంటుంది. అలా ఉన్నప్పుడే ఆ ఇంట్లో పిల్లలు చదువుకుంటారు.. ఆ కుటుంబం సమాజంలో గౌరవంగా బతకగలదని మా ప్రభుత్వం నమ్మింది’ అని సీఎం చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లలోనే నేటికీ పేదలు ఉంటున్నారని అన్నారు. నాడు రెండేళ్ల పిల్లవాడు ఇప్పుడు పాతికేళ్ల వాడు అయ్యాడని, ఆయనకు పెళ్లి అయి పిల్లలు అయ్యే పరిస్థితి వచ్చిందని, వారికి సొంత ఇల్లు, వారు ఆత్మగౌరవంతో బతకాలనే ఇందిరమ్మ ఇళ్లు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని సీఎం చెప్పారు.
వారు ఇళ్లు ఇచ్చిన గ్రామాల్లోనే కేసీఆర్, మోదీ ఓటు అడగాలి..
2014 ఎన్నికలకు ముందు డబ్బా ఇల్లు వద్దు… డబుల్ బెడ్రూం ఇల్లు ముద్దు.. కోడుకు, కోడలు, పండగ రోజు బిడ్డ, అల్లుడు వస్తే ఎక్కడ ఉంటారు? గొర్రె, మేక పిల్లలు ఎక్కడ కట్టేస్తారంటూ ఇంటిపైన పేదలకు ఉండే కలలపైన కేసీఆర్ వ్యాపారం చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. సొంత ఇల్లు లేక, కిరాయి కట్టలేక గుడిసెలోనో, వేరే ఇళ్లలోనో ఉన్న పేదలు కేసీఆర్ ఏదో చేస్తారని ఆశించారని, ఒక్కసారి కాదు చెప్పిన కథే సర్పంచి, ఎంపీటీసీ, జడ్పీటీసీ, రెండుసార్లు ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల ముందు చెప్పిందే చెప్పి పదేళ్లు తెలంగాణ ప్రజలను మోసం చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ మోసాలకు, అబద్ధాలకు కాలం చెల్లిందని చెప్పి కేసీఆర్, బీఆర్ ఎస్ను బొందపెట్టి తెలంగాణ ప్రజలు ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారని అన్నారు. అందుకే తాము ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి భద్రాద్రి రామచంద్రుని ఆశీర్వాదంతో ఇందిరమ్మ ఇళ్లు కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. పేదలు, అర్హులైన వారికే తాము ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని, కోటీశ్వరులకు ఇవ్వబోమని స్పష్టంచేశారు. ఏ పథకం ప్రారంభించినా దానిని మొత్తం అమలుచేసే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. హడావిడిగా ప్రారంభించి అటక మీద పెట్టే ప్రయత్నంచేయబోమని స్పష్టం చేశారు. నాడు ఆకాశమే హద్దుగా ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు ఉన్న ఊళ్లలో కేసీఆర్ ఓట్లు వేయించుకోవచ్చని, ఇందిరమ్మ ఇళ్లు ఉన్న ఊళ్లలో తాము ఓట్లు వేయించుకుంటామని, ఇందుకు కేసీఆర్ సిద్ధమా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాటలకు హద్దే లేదని, ఆయన ఆయన మంచి మంచి డ్రెస్లు వేస్తూ, తియ్యతియ్యని మాటలు చెబుతారని ముఖ్యమంత్రి విమర్శించారు. 2022 వరకు దేశంలోని పేదలందరికీ ఇళ్లు కట్టిస్తామని గత ఎన్నిలకు ముందు బీజేపీ మేనిఫెస్టోలో పెట్టారని, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వారు ఎక్కడి ఇళ్లు కట్టించారో బీజేపీ నాయకులు కిషన్రెడ్డి, లక్ష్మణ్, ఈటల రాజేందర్ చెప్పాలని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇళ్లు ఉన్న చోట్ల బీజేపీ నాయకులు ఓట్లు వేయించుకోవచ్చని, అక్కడ తాము ఓట్లు అడగబోమని అన్నారు. అసలు రాష్ట్రంలో బీజేపీ ఎన్ని ఇళ్లు ఇచ్చిందో చెప్పాలని ముఖ్యమంత్రి డిమాండ్ చేశారు.
రైతుల ఆదాయం రెట్టింపు అయింది ఎక్కడ?
2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారని, కానీ పెట్టుబడి దక్కక లక్షలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని రేవంత్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కనీస మద్దతు ధర కోసం ఢిల్లీ సరిహద్దుల్లో దీక్షలు చేస్తుంటే మోదీ ప్రభుత్వం తుపాకీ తూటాలు పేల్చి రైతులను బలి తీసుకుందని ఆరోపించారు. స్విస్ బ్యాంకుల్లో నల్ల ధనం తెచ్చి పేదల ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తానని మోదీ చెప్పారని, రూ.15 లక్షలు కాదు కదా 15 పైసలైనా వేయలేదని విమర్శించారు. 2014 ఎన్నికల ముందు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని మోదీ చెప్పారని, అలా చేసినట్లయితే ఈ పదేళ్లలో తెలంగాణకు కనీసం 60 నుంచి 70 లక్షల ఉద్యోగాలు వచ్చేవని ముఖ్యమంత్రి అన్నారు.
92 రోజుల్లోనే..
తమ ప్రభుత్వం వచ్చి 92 రోజులు అయిందని, ఈ కాలంలోనే ఎన్నో కార్యక్రమాలు అమలు చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని, ఇప్పటికే సుమారు 24కోట్ల పైచిలుకు మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేశారని తెలిపారు. పేదలకు మెరుగైన చికిత్సలు అందించేందుకు రాజీవ్ ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.పది లక్షలకు పెంచామని అన్నారు. కట్టెల పొయ్యితో అనారోగ్యం బారిన పడుతున్న మహిళలను రక్షించేందుకు యూపీఏ ప్రభుత్వం రూ.400కే గ్యాస్ సిలిండర్ ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రిగా కేసీఆర్ పదవులు చేపట్టాక రూ.400 సిలిండర్ను రూ.1200 చేశారని, రూ.55గా ఉన్న లీటర్ పెట్రోల్ ధరను రూ.110, రూ.50 ఉన్న లీటర్ డీజిల్ ధరను రూ.వంద చేశారని ముఖ్యమంత్రి విమర్శించారు. పెరిగిన సిలిండర్ ధర భరించలేక గ్యాస్ పొయ్యి పైన పడేసి మహిళలు కట్టెలపొయ్యి వైపు వెళుతుంటే అలా వెళ్లవద్దని భావించి రూ.500కే సిలెండర్ ఇస్తామని ఎన్నికల ముందు ప్రకటించామన్నారు. అధికారంలోకి రాగానే రూ.500కు సిలెండర్ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. తాను భద్రాచలంలో, ఇల్లెందులో పాదయాత్ర చేస్తున్నప్పుడు, భట్టి విక్రమార్క ఇతర ప్రాంతాల్లో పాదయాత్ర చేస్తున్న సమయంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తున్నారని, భూమి లేని తమ ఇళ్లకు ఉచిత కరెంటు ఇవ్వాలని, తాము కరెంటు బిల్లులు కట్టలేకపోతున్నామని పేదలు తెలపడంతో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ హామీ ఇచ్చామని తెలిపారు. అధికారంలోకి రాగానే దానిని అమలు చేస్తున్నామని చెప్పారు. ఇప్పుడు టీవీ పెట్టుకున్నా, ఫ్యాన్ వేసుకున్నా బిల్లు రాదని, ఆడ బిడ్డలు రూపాయి రూపాయి కూడబెట్టి కరెంటు బిల్లులు కట్టనవసరం లేకుండా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని తెలిపారు…
భద్రాచలం రిటైనింగ్ వాల్కు రూ.500 కోట్లు..
కాంగ్రెస్కు, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు బలమైన అనుబంధం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సభలో సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఉన్నారని, ఒకనాడు ఈ జిల్లాలో కాంగ్రెస్కు, కమ్యూనిస్టులకు ఎంత వైరుధ్యం ఉన్నా, ఎన్నో రకాల ఇబ్బందులు వచ్చినా ఈ రోజు కలిసి ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేయాలని ఆలోచన చేస్తున్నామని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా కార్యకర్తలు ఎన్ని కేసులైనా తట్టుకున్నారని, ఎన్ని ఇబ్బందులు వచ్చినా తట్టుకొని నిలబడ్డారని ముఖ్యమంత్రి కొనియాడారు. 2014, 2018తో పాటు మొన్నటి శాసనసభ ఎన్నికల్లోనూ బీఆర్ ఎస్కు ఒక్కో సీటు చొప్పునే ఖమ్మం జిల్లా ప్రజలు ఇచ్చారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. మొదటి నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు కేసీఆర్ను నమ్మలేదని, కేసీఆర్ మాయమాటలకు లొంగలేదని, అందుకే ఇందిరమ్మ ఇళ్లు వంటి మంచి కార్యక్రమాన్ని ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచే మొదలుపెట్టామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో విలీనం చేసిన అయిదు గ్రామాలను తిరిగి భద్రాచలంలో కలపాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే పొడెం వీరయ్య కోరారని, రాముల వారి ఆలయం అభివృద్ధిపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అడిగారని ముఖ్యమంత్రి తెలిపారు. గోదావరి ఉప్పొంగి ఏటా భద్రాచలం ఊళ్లోకి, ఇళ్లలోకి నీరు వస్తుండడంతో రిటైనింగ్ వాల్ కట్టాలని తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే నిర్ణయించి రూ.500 కోట్లు మంజూరు చేశామని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రజలు కష్టాలు తీర్చాల్చిన బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుంటుందని ముఖ్యమంత్రి తెలిపారు. సభ అనంతరం పినపాక, అశ్వారావుపేట, కొత్తగూడెం, భద్రాచలం, ఇల్లెందు నియోజకవర్గాలకు చెందిన మహిళలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు.
యాదగిరిగుట్ట, భద్రాచలం ఆలయాల్లో ముఖ్యమంత్రి పూజలు..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పూజలు చేశారు. ముఖ్యమంత్రి దంపతులకు ఆలయంలో అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి భద్రాచలం వెళ్లారు. భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఆలయ సంప్రదాయం ప్రకారం ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు.