CPI VS BRS | బీఆర్ఎస్, సీపీఐ మధ్య చిచ్చు పెట్టిన సభ! ప్రజాగర్జన సభకు అనుమతి నిరాకరణ తెగదెంపులకు సిద్ధపడుతున్న సీపీఐ? జూన్ 1న సీపీఐ రాష్ట్ర కార్యవర్గం సమావేశం విధాత : గత కొన్నాళ్లుగా (BRS) బీఆర్ఎస్తో సీపీఐ(CPI ) చేస్తూ వచ్చిన స్నేహం ఇక ముగింపునకు వచ్చినట్టేనా? అంటే అవుననే సమాధానమే వస్తున్నది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో సీపీఐ నిర్వహించ తలపెట్టిన ప్రజాగర్జన సభకు తొలుత అనుమతినిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం తీరా […]
CPI VS BRS |
విధాత : గత కొన్నాళ్లుగా (BRS) బీఆర్ఎస్తో సీపీఐ(CPI ) చేస్తూ వచ్చిన స్నేహం ఇక ముగింపునకు వచ్చినట్టేనా? అంటే అవుననే సమాధానమే వస్తున్నది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో సీపీఐ నిర్వహించ తలపెట్టిన ప్రజాగర్జన సభకు తొలుత అనుమతినిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం తీరా సభకు సమయం దగ్గర పడుతున్న వేళ అనుమతి నిరాకరించింది. ఇది రెండు పార్టీల మధ్య చిచ్చు రాజేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తొమ్మిదేళ్ల పాలనలో ఏనాడూ ప్రగతిభవన్ గేటు దాటని వామపక్షాలను ముఖ్యమంత్రి కేసీఆర్ మునుగోడు ఉప ఎన్నికలో తన రాజకీయ ప్రయోజనాల కోసం చేరదీశారన్న అభిప్రాయాలు ఉన్నాయి. మునుగోడులో బీఆర్ఎస్ గెలిచిందంటే అది ముమ్మాటికీ వామపక్షాల బలం తోడవడం వల్లేననేది బహిరంగ రహస్యం. తదుపరి ఉభయ కమ్యూనిస్టు పార్టీలు తనకు కుడి, ఎడమ భుజాల్లా వ్యవహరిస్తారన్న భావనను ప్రజల్లో కేసీఆర్ కలిగించారని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
అకాల వర్షాలతో పంటలు నష్టపోయినప్పుడు రెండు వామపక్ష పార్టీల నేతలను స్వయంగా వెంటేసుకొని ఖమ్మం, వరంగల్ జిల్లాలో సీఎం పర్యటించారు. దాంతో వామపక్షాలు రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్తో కలిసి పోటీ చేస్తాయనే భావనలు ప్రజల్లోకి వెళ్లాయి. ఇక సీట్ల పంపకాలే తరువాయి అన్న పరిస్థితీ నెలకొన్నది. అయితే.. ప్రస్తుతానికి సీపీఐ, బీఆర్ఎస్ మధ్య పొత్తు అనేది ఆదిలోనే తుడిచిపెట్టుకుపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అధికార పార్టీ అధినేతను సంతృప్తి పరచడానికో, లేక తమ ఉనికిని చాటుకోవడానికో.. గత నెల 14 నుండి ‘బీజేపీ హఠావో.. దేశ్ కీ బచావో’ పేరిట సీపీఐ పల్లె పల్లెకూ వెళ్లే కార్యక్రమం నిర్వహించింది. దీని ముగింపు సభను సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో అంతకుముందే మంత్రి కే తారక రామారావు నిర్వహించిన సభా వేదిక ప్రాంగణంలో నిర్వహించి.. హుస్నాబాద్ నుంచి తామే పోటీలో ఉంటామన్న సంకేతాన్ని పంపింది.
అప్పటికే ఇదే వేదిక నుంచి అంతకు ముందు సభలో మాట్లాడిన మంత్రి కేటీఆర్.. స్థానిక ఎమ్మెల్యే సతీశ్బాబును లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. వాస్తవానికి ఈ సీటును సీపీఐ ఆశిస్తున్నదని అప్పటికే వార్తలు వచ్చినా.. కేటీఆర్ ఏకపక్షంగా ముందే అభ్యర్థిని ప్రకటించడం సీపీఐకి కొంత ఇబ్బందికరంగా మారింది. అయినా.. కేటీఆర్కు కౌంటర్గానా అన్నట్టు హుస్నాబాద్ నుంచి సీపీఐ పోటీ చేస్తుందని ఆ పార్టీ నేతలు బహిరంగ సభ సందర్భంగా ప్రకటించారు.
ఆ సమయంలోనే సీపీఐ, బీఆర్ఎస్ మధ్య పొత్తు పొడిచే విషయంలో అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇక సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు టికెట్ ఆశిస్తున్న కొత్తగూడెం నియోజకవర్గం కేంద్రంలో తాజాగా ఆ పార్టీ జూన్ 4వ తేదీన ప్రజాగర్జన పేరిట భారీ బహిరంగసభను నిర్వహించేందుకు సిద్ధమైంది.
రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులను అక్కడికి తరలించి, తమ బలం చాటుకోవాలని భావించింది. ఇక్కడే అనుకోని ట్విస్ట్ చోటు చేసుకున్నది. అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించ తలపెట్టిన ఈ సభకు తొలుత అనుమతి ఇచ్చినా.. మధ్యలో ఏమైందోగానీ.. అధికారులు ఆ అనుమతిని ఆకస్మికంగా రద్దు చేశారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలను అందుకు కారణంగా అధికారులు చూపుతున్నారు.
ఇది సీపీఐ శ్రేణులకు ఆగ్రహాన్ని కల్గించింది. ఇక చేసేది లేక ఆ రోజు కార్యక్రమాన్ని సీపీఐ రద్దు చేసుకున్నది. సభను రద్దు చేసుకున్నా.. తదుపరి కార్యాచరణకు సీపీఐ సిద్ధమవుతున్నదని సమాచారం. ఈ విషయంలో తదుపరి చర్యలు తీసుకునేందుకు జూన్ 1న సీపీఐ రాష్ట్ర కార్యవర్గం హైదరాబాద్లో సమావేశం కానున్నదని విశ్వసనీయవర్గాలు చెప్పాయి.
వాస్తవానికి కర్ణాటక ఫలితాల అనంతరం బీఆర్ఎస్తో పొత్తు విషయంలో సీపీఐ పునరాలోచనలో పడినట్టు తెలుస్తున్నది. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత తమ పుట్టి ముంచడం ఖాయమనే అభిప్రాయానికి వచ్చిందని సమాచారం. విశాల లౌకిక శక్తుల ఏకీకరణకు తమ పార్టీ ప్రయత్నిస్తుందని అంతకు ముందు సీపీఐ రాష్ట్ర మాజీ కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి ప్రకటించడం గమనార్హం.
బీజేపీకి వ్యతిరేకంగా తాము పనిచేస్తానని చెబుతున్నా.. కేసీఆర్ ఆలోచనా ధోరణి అందుకు అనుగుణంగా లేదని సీపీఐ నాయకుడొకరు చెప్పారు. వ్యతిరేకంగా లేకపోగా అనుకూలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆయన అన్నారు.
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో కవితపై ఈగ కూడా వాలకుండా చూస్తున్నారంటే అది బీజేపీతో ఏదో రహస్య అవగాహన ఉండబట్టేనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. మొత్తానికి కేసీఆర్తో పొత్తుకు వెళితే అంతిమంగా తమకే నష్టం జరుగుతుందనే అంచనాకు సీపీఐ నాయకత్వం ముందే వచ్చిందని తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో సీపీఐ కార్యవర్గ సమావేశంపై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉన్నది.