Income Tax | పన్ను చెల్లింపుదారులకు కీలక అలెర్ట్. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త పన్ను విధానం అమలులోకి రాబోతున్నది. ముఖ్యంగా స్లాబ్స్, రిబేట్స్, డిడక్షన్స్ రూల్స్ మారనున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త పన్ను విధానం డీఫాల్ట్గా అమలులోకి రాబోతున్నది. ఐటీఆర్ ఫైలింగ్ను క్రమబద్ధీకరించడం, ప్రజలు సక్రమంగా పన్ను చెల్లించేలా ప్రోత్సహించడమే దీని లక్ష్యమని ఆర్థికశాఖ పేర్కొంది. అయితే, కొత్త పన్ను విధానం ప్రయోజనకరంగా లేకపోతే.. పాత పన్నుల విధానాన్నే అనుసరించేందు స్వేచ్ఛ ఇచ్చింది.
గతేడాది ఏప్రిల్ నుంచి ప్రైమరీ పన్ను మినహాయింపు పరిమితిని రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచిన విషయం తెలిసిందే. అయితే ఆదాయపు పన్ను చట్టం-1961లోని సెక్షన్ 87A ప్రకారం.. పన్ను మినహాయింపు పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచారు. దాంతో ఏప్రిల్ 1 నుంచి రూ.7 లక్షలలోపు ఆదాయం ఉన్నవారంతా పూర్తి పన్ను రాయితీని పొందనున్నారు. వీరంతా ప్రభుత్వానికి ఇకపై ఆదాయపు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉండదన్నమాట.
రూ.3 లక్షల నుంచి 6 లక్షల ఆదాయం పొందే వారిపై 5శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. రూ.6 లక్షల నుంచి రూ.9 లక్షల ఆదాయం ఉన్నవారు 10శాతం, రూ.9 లక్షల నుంచి రూ.12 లక్షల ఆదాయానికి 15శాతం, రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల ఆదాయానికి 20శాతం కట్టాల్సి ఉంటుంది. రూ.15 లక్షలు అంతకంటే ఎక్కువ ఆదాయం పొందే వారికి 30శాతం ట్యాక్స్ వర్తిస్తుంది.
రూ.50వేల స్టాండర్డ్ డిడక్షన్ పాత పన్ను విధానంలో ఉండగా.. దీన్ని కొత్త పన్ను విధానంలోనూ తీసుకువచ్చారు. దాంతో 2024 ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త పన్ను విధానంలోనూ బేసిక్ డిడక్షన్ జరుగుతుంది. దాంతో పన్ను చెల్లింపుదారులకు మరింత ప్రయోజనం చేకూరనున్నది.
రూ.5 కోట్ల కంటే ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించే వారిపై ఇప్పటి వరకు 37శాతం సర్చార్జి విధిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్సర్చార్జిని 25 శాతానికి తగ్గించారు. ఇది కొత్త ఆర్థిక సంవత్సరమైన ఏప్రిల్ ఒకటి నుంచి అమలులోకి రాబోతున్నది.
2023 ఏప్రిల్ ఒకటి లేదంటే ఆ తర్వాత జారీ చేసిన జీవిత బీమా పాలసీలకు సంబంధించి ప్రీమియం మొత్తం రూ.5 లక్షలకు మించి ఉంటే పన్ను విధించనున్నారు. రూ.5 లక్షలకుపైగా వార్షిక ప్రీమియం చెల్లించే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలపై (యూనిట్ లింక్డ్ పాలసీలు మినహా) కాలపరిమితి ముగిసిన తర్వాత అందే మొత్తానికి ఆదాయపు పన్ను వర్తించనున్నది. ఈ కొత్త పన్ను 2023 ఏప్రిల్ 1 నుంచి తీసుకునే పాలసీలకు వర్తిస్తుందని కేంద్రం పేర్కొంది.
ప్రభుత్వేతర ఉద్యోగులకు లీవ్ ఎన్క్యాష్మెంట్ పన్ను మినహాయింపు పరిమితి 2022 నుంచి రూ.3 లక్షలుగా ఉండగా.. ఈ ఏప్రిల్ ఒకటి నుంచి దీన్ని రూ.25 లక్షలకు పెంచబోతున్నారు. ఇది ప్రైవేట్ రంగ ఉద్యోగులకు మంచి ఉపయోగకరంగా ఉండనున్నది.