TS TET | టీఎస్ టెట్ ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. బుధవారం ఉదయం 10 గంటలకు టెట్ ఫలితాలను విడుదల చేయనున్నట్టు టెట్ కన్వీనర్ రాధా రెడ్డి వెల్లడించారు. టెట్ ఫలితాలను తమ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్టు ఆమె పేర్కొన్నారు. ఈ నెల 15వ తేదీన టెట్ పేపర్-1, పేపర్-2 పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. పేపర్-1కు 2.26 లక్షల మంది, పేపర్-2కు 1.90 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు.
టెట్ అర్హత కాల పరిమితి జీవితకాలం ఉంటుంది. పేపర్-1లో ఉత్తీర్ణత సాధించిన వారు ఒకటి నుంచి 5వ తరగతి వరకు బోధించే ఎస్జీటీ పోస్టులకు, పేపర్-2లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఆరు నుంచి ఎనిమిదవ తరగతి వరకు బోధించే స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హులు. రాష్ట్రంలో టీచర్ ఉద్యోగాల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైన విషయం విదితమే. దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఏడాది నవంబర్ 20 నుంచి 30 వరకు డీఎస్సీ నిర్వహించనున్నారు.