Uttam Kumar Reddy| కాళేశ్వరం అక్రమాలకు కేసీఆరే బాధ్యుడు

నిపుణుల కమిటీ వద్దన్నా… వినని కేసీఆర్
కాళేశ్వరం ప్లానింగ్- నిర్మాణం- నిర్వహణలకు బాధ్యుడు కేసీఆరే
స్పష్టం చేసిన కమిషన్
కేబినెట్కు 60 పేజీల నోట్
కేబినెట్ ముందు పవర్ పాయింట్ ప్రజంటేన్ చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్, ఆగస్ట్4(విధాత): నిపుణుల కమిటీ వద్దని ఇచ్చిన నివేదికను ఉద్దేశ పూర్వకంగా తొక్కి పెట్టి నాటి సీఎం కేసీఆర్(KCR) కాళేశ్వరం ప్రాజెక్ట్ (Uttam Kumar Reddy),నిర్మించారని కాళేశ్వరంపై రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ కమిషన్ స్పష్టం చేసింది. ఈ మేరకు సోమవారం అంబేద్కర్ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశంలో పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ను సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy)పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. పీసీ ఘోష్ ఇచ్చిన 665 పేజీల రిపోర్ట్ను అధికారుల కమిటీ 60 పేజీల సారాంశాన్ని రూపొందించి కేబినెట్కు సమర్పించింది. కేబినెట్ సభ్యులందరికీ ఈ 60 పేజీల సారాంశాన్ని ప్రభుత్వం అందజేసింది. ఈ సంక్షిప్త నివేదికలో మాజీ సీఎం కేసీఆర్ పేరు 32 సార్లు, మాజీ మంత్రి హరీశ్రావు పేరు 19 సార్లు, మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పేరు 5 సార్లు ప్రస్తావించారు.
-కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్లానింగ్ నుంచి నిర్మాణంతో పాటు బ్యారేజ్ ల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ వరకు జరిగిన అవకతవకలు అక్రమాలకు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యక్షంగా, పరోక్షంగా బాధ్యుడని ఘోష్ నివేదిక ప్రస్తావించినట్లు కేబినెట్కు మంత్రి తెలిపారు. అలాగే కేసీఆర్ తో పాటు అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు కూడా బాధ్యుడేనని కమిషన్ తన నివేదికలో తెలిపింది.
– మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ ల నిర్మాణానికి కేబినెట్ సబ్ కమిటీ సిఫారసు చేసిందని.. కేబినెట్ అనుమతి ఉందని అప్పటి ఆర్ధిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ తప్పుడు సమాచారం ఇచ్చినట్లు కమిషన్ తన నివేదిక లో ప్రస్తావించినట్లు మంత్రి ఉత్తమ్ కేబినెట్కు వివరించారు.
అప్పుడు ఆర్ధిక మంత్రి గా ఉన్న ఈటల ఉదాసీనంగా, నిర్లక్ష్యం గా వ్యవహరించారని కమిషన్ తప్పు పట్టిందన్నారు. అలాగే కొందరు అధికారులు తప్పుడు సాక్ష్యాలు సమర్పించారని.. వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కమిషన్ ప్రభుత్వానికి సూచించినట్లు మంత్రి కేబినెట్కు వివరించారు.