తగ్గిన బంగారం, వెండి ధరలు
శనివారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 980 తగ్గి, రూ. 1,56,930కి పడిపోయింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 900తగ్గి రూ.1,43,850 వద్ద నిలిచింది. కిలో వెండి ధర రూ. రూ.15,000 తగ్గి రూ.2,90,000కి పడిపోయింది.
విధాత, హైదరాబాద్ : పశ్చిమాసిక యుద్ద ఉద్రిక్తతలతో అంతర్జాతీయంగా భౌగోళిక, రాజకీయ, ఆర్థిక పరిణామాల మార్పుల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు భారీ ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. శనివారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 980 తగ్గి, రూ. 1,56,930కి పడిపోయింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 900తగ్గి రూ.1,43,850 వద్ద నిలిచింది. కిలో వెండి ధర రూ. రూ.15,000 తగ్గి రూ.2,90,000కి పడిపోయింది.
ఎంసీఎక్స్ (MCX) మార్కెట్లో బంగారం ధర సుమారు 2 శాతం మేర పడిపోగా, కిలో వెండి ధర ఏకంగా 7 శాతం మేర పతనమైంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారుతాయని ఆశించిన ఇన్వెస్టర్లకు, అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు నిలిచిపోవడం పెద్ద నిరాశను మిగిల్చింది. దీనికి తోడు ప్రపంచ ఇంధన రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధి మూసివేత కొనసాగుతుండటంతో సరఫరా వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ఈ పరిణామాల వల్ల ముడి చమురు ధరలు పెరిగి, అమెరికాలో ద్రవ్యోల్బణం గత నాలుగేళ్లలో ఎన్నడూ లేని స్థాయికి చేరుకుంది. పెరిగిన ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించకపోగా, డిసెంబర్ నాటికి మరోమారు పెంచే అవకాశం ఉందన్న సంకేతాలు వెలువడటంతో సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం నుంచి ఇన్వెస్టర్లు తమ నిధులను ఉపసంహరించుకుంటున్నారు.
మరోవైపు, అంతర్జాతీయ మార్కెట్లో అమెరికన్ డాలర్ సూచీ 100 మార్కు వైపు దూసుకుపోతుండటం పసిడి ధరలపై మరింత ఒత్తిడిని పెంచింది. సాధారణంగా డాలర్ బలపడినప్పుడు బంగారం ధరలు తగ్గుముఖం పడతాయి. దీనికి తోడు, దేశీయంగా రూపాయి విలువ రికార్డు స్థాయిలో పడిపోతుండటంతో దాన్ని కాపాడేందుకు భారత ప్రభుత్వం బంగారం దిగుమతులపై ఆంక్షలను కఠినతరం చేసింది. ఈ నిర్ణయం వల్ల దేశీయ మార్కెట్లో బంగారం లభ్యత మరియు డిమాండ్పై ప్రభావం పడింది. ఇవన్నీ ఇన్వెస్టర్లలో భయాందోళనలను రేకెత్తించి, పసిడి మార్కెట్లో భారీ పతనానికి దారితీశాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram