అంతర్జాతీయ భౌగోళిక, ఆర్థిక పరిణామాల క్రమంలో బంగారం ధరలు పైపైకి దూసుకపోతున్నాయి. గురువారం 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ 270 పెరిగి రూ. 1,55,130 వద్ద నిలిచింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 250 పెరిగి రూ.1,42,200వద్ద కొనసాగుతుంది. కిలో వెండి ధర రూ. 2,60,000వద్ద స్థిరంగా నిలిచింది.
మరింత పైకి పసిడి ధరలు..
కొన్ని రోజులుగా వరుస పెరుగుదలను నమోదు చేస్తున్న బంగారం ధరలు ఇంకా పెరుగుతాయా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. బంగారం ధర పెరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ ఆర్థిక నిపుణుడు, రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ చేశారు. బంగారానికి డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. బంగారం, వెండి ధర ఇంకా పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. పసిడికి పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా ధరలు ఇంకా పైకి వెళ్లే అవకాశం ఉందని తెలిపారు.
పెట్టుబడిదారులు కాకుండా అమెరికా డాలర్లను పెద్ద మొత్తంలో కలిగి ఉన్న సెంట్రల్ బ్యాంకులు కూడా భారీగా పసిడిని కొనుగోలు చేస్తున్నట్ట్లు తెలిపారు. ప్రపంచ దేశాలు అమెరికా డాలర్లకు బదులుగా బంగారాన్ని నిల్వ చేసుకునే విధానం పెరిగిందని.. ఇద గత 50 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా పెరిగిందని కియోసాకి పేర్కొన్నారు. అంతకుముందు డాలర్ విలువకు బంగారం ఆధారం ఉండేదని, ఆ తర్వాత అది ప్రభుత్వంపై, దాని విశ్వసనీయతపై ఆధారపడే కరెన్సీగా మారిందని తెలిపారు.
అమెరికా అప్పులు భారీగా పెరిగిన నేపథ్యంలో ప్రపంచ దేశాలు తమ డాలర్ నిల్వలను బంగారంగా మార్చుకునే విధానం పెరుగిపోతుందని అంచనా వేశారు.అందుకే బంగారం ధరలు పెరిగే ఛాన్స్ అధికంగా ఉందన్నారు. ఇప్పటికైనా బంగారం, వెండిలో పెట్టుబడి పెడితే మంచిదని సూచించారు.
