విధాత : దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి(SS Rajamouli)- సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu) లీడ్ రోల్‌లో నటిస్తోన్న ఎస్‌ఎస్‌ఎంబీ 29 (SSMB 29) మూవీ ఆఫ్రికన్ అడ్వెంచరస్‌ ప్రాజెక్ట్‌గా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల భారత్ లోని ఒరిస్సాలో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ కెన్యా, టాంజానీయా(Tanzania Shooting)కు మారింది. ప్రస్తుతం రాజమౌళి బృందం సెరెంగెటి నేషనల్‌ పార్క్‌ టాంజానియా(Serengeti National Park)తో పాటు ఇతర లొకేషన్లలో నెక్ట్స్ షెడ్యూల్‌ కొనసాగిస్తుంది. జంగిల్‌ పార్క్ లో సఫారీ రైడ్‌ చేస్తూ జంతువులను షూట్‌ చేస్తున్నారు. బ్లూ, గ్రీన్ స్క్రీన్ స్టూడియోకి బదులుగా లైవ్ లొకేషన్‌లో షూటింగ్‌ చేసి కెమెరాతో తీసిన రియలిస్టిక్‌ సీన్లను సినిమాలో చూపించాలన్న సంకల్పంతో ముందస్తుగా జంతువులను, అడవి ప్రదేశాలను షూట్ చేస్తున్నారు.

ఇప్పటికే మూవీ హీరోయిన్‌ ప్రియాంకా చోప్రా ప్రైడ్‌ ల్యాండ్స్‌ (సింహాలకు ఆవాసమైన సవన్నా భూభాగం)లో సఫారీ రైడ్‌ చేసి హైనా, హిప్పోపొటామస్‌, ఆస్ట్రిచ్‌, ఆఫ్రికన్‌ బఫెలో లాంటి వాటిని కెమెరాలో బంధించి ఆ ఫొటోలను ఇన్‌ స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఆ ఫోటోలు చూసిన ఫ్యాన్స్ ఫారెస్ట్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మరింత ఆసక్తి పెంచుకుంటున్నారు. మూవీ గ్లోబల్ యాక్షన్‌ అడ్వెంచరస్‌ డ్రామాగా రూపుదిద్దుకుంటుండటంతో షూటింగ్ అధిక భాగం పలు దేశాల్లోని కీలక అటవీ ప్రాంతాల్లో రాజమౌళీ చేస్తున్న తీరు సినిమాలపై అంచనాలు పెంచింది.