ఒకప్పటి అందాల తార లయ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. చూడ చక్కని అందం, ఆకట్టుకునే అభినయంతో అశేష ప్రేక్షకాదరణ దక్కించుకుంది. స్వయంవరం సినిమాతో వెండితెరకు పరిచయమై.. తొలి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ అందాల ముద్దుగుమ్మ ఆ తర్వాత జగపతి బాబు.. రాజశేఖర్, అర్జున్ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుని స్టార్ హీరోయిన్గా ఎదిగింది. కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న సమయంలోనే లయ సినిమాలకి దూరమైంది. పెళ్లి చేసుకొని అమెరికాలో ఉంటున్న లయ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తూ ఉంటుంది. ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోస్ షేర్ చేయడంతో పాటు స్నేహితులతో కలిసి ఎవర్ గ్రీన్ సాంగ్స్ కు అదిరిపోయే స్టెప్పులేస్తూ తన అభిమానులకి మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది.
గ్లామర్ షో కి తావు లేకుండా కేవలం తన అద్భుతమైనటువంటి నటనతో ప్రేక్షకులని మెప్పించిన అందాల ముద్దుగుమ్మ లయ త్వరలో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవల లయ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ఆసక్తికర విషయాలు పంచుకుంటుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న లయ సోషల్ మీడియాలో తన గురించి వస్తున్న ప్రచారాల గురించి క్లారిటీ ఇచ్చింది. తాను చిరంజీవి గారిని సాయం అడిగితే ఆయన సాయం చేయలేదంటూ ఓ వార్త నెట్టింట వైరల్ కాగా, దానిపై లయ స్పందించింది. మా నాన్న డాక్టర్ కావడంతో చిన్నప్పటినుంచి నాకు ఎలాంటి అవసరం వచ్చిన కూడా ఆయననే చూసుకునే వారు. నాకు ఇప్పటికీ ఆర్ధికంగా ఏ ఇబ్బంది లేదు.
కొన్ని యూట్యూబ్ ఛానల్ వాళ్ళు నేను ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నానని అందుకోసమే చిరంజీవి గారిని సాయం అడిగాను, ఆయన సాయం చేయలేదంటూ వార్తలు రాశారు. ఇది పచ్చి అబద్ధం. చిరంజీవిగారు చాలా మంది సాయాలు చేస్తారు. నేను ఆయన దగ్గర సాయం కోసం వెళ్లింది లేదు. అంత పరిస్థితి కూడా రాలేదు అంటూ లయ చెప్పుకొచ్చింది. లయ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి.