జీఎస్టీ రీఫండ్ లో అక్రమాలకు పాల్పడిన ఐదుగురు జీఎస్టీ అధికారులను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనం రేపింది. డిప్యూటీ కమిషనర్(డీసీ)గా నల్గొండలో పనిచేస్తున్న స్వర్ణకుమార్, హైదరాబాద్లో సహాయ
రూ.23.78 కోట్ల జీఎస్టీ రీఫండ్లో అక్రమాల గుర్తింపు
విధాత : జీఎస్టీ రీఫండ్ లో అక్రమాలకు పాల్పడిన ఐదుగురు జీఎస్టీ అధికారులను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనం రేపింది. డిప్యూటీ కమిషనర్(డీసీ)గా నల్గొండలో పనిచేస్తున్న స్వర్ణకుమార్, హైదరాబాద్లో సహాయ కమిషనర్లు(ఏసీ)గా పనిచేస్తున్న వేణుగోపాల్, విశ్వకిరణ్, ఉప వాణిజ్య పన్నుల అధికారి వెంకటరమణ, సీనియర్ అసిస్టెంటు మహితను పోలీసులు అరెస్టు చేశారు. మాదాపూర్ జీఎస్టీ కార్యాలయం పరిధిలో రూ.23.78 కోట్ల జీఎస్టీ రిఫండ్ కేసులో అవినీతికి సహకరించినందుకు వీరిని అరెస్టు చేసినట్లు వాణిజ్య పన్నులశాఖ వర్గాలు తెలిపాయి. నలగండ్లలో నివాసముంటున్న వేమిరెడ్డి రాజా రమేశ్ రెడ్డి(40) అనే వ్యక్తి ‘వినర్డ్ ఆటోమొబైల్స్ ప్రైవేటు లిమిటెడ్ అనే కంపెనీకి ఎండీ హోదాలో నకిలీ పత్రాలు సృష్టించి జీఎస్టీని ప్రభుత్వం నుంచి రిఫండ్ తీసుకున్నట్లు వాణిజ్య పన్నులశాఖ విచారణలో తేలింది.
2022 ఏప్రిల్ నుంచి 2023 ఆగస్టు వరకూ ఈ కంపెనీ పేరుతో ఆటోమొబైల్ విడిభాగాలు దిగుమతి చేసుకుని వాటిపై 5 శాతం జీఎస్టీ చెల్లించినట్లు తొలుత నకిలీ బిల్లులు సృష్టించారు. విడిభాగాలతో విద్యుత్ బైకులు తయారుచేసి విక్రయించామని వాటిపై 18 శాతం జీఎస్టీ చెల్లించినట్లు రశీదులు సృష్టించారు. వాటిపై తమకు 13 శాతం జీఎస్టీ వెనక్కి ఇవ్వాలని(రీఫండ్) మాదాపూర్ జీఎస్టీ కార్యాలయంలో పలు దపాలుగా బిల్లులు దాఖలు చేశారు. సరిగా తనిఖీ చేయకుండా రూ.23.78 కోట్లకు పైగా రీఫండ్ ఇచ్చేశారు. ఈ వ్యవహారంలో కంపెనీ డైరెక్టర్ వి. రామకృష్ణారెడ్డిని గతంలో అరెస్టు చేశారు. ఆయన ఇచ్చిన సమాచారం మేరకు నకిలీ బోగస్ బిల్లుల ఆమోదానికి ఆ సమయంలో పనిచేసిన ఐదుగురు ఉద్యోగులు సహకరించినట్లు తేలటంతో అరెస్టు చేశారు. ఇదే కేసులో గతంలో నలుగురు వ్యక్తులను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.