Murder | ముంబై : ఆస్తిపై కన్నేసిన ఓ కోడలు తన మామను మట్టుబెట్టింది. రూ. 300 కోట్ల ఆస్తి కోసం.. రూ. కోటి సుఫారీ ఇచ్చి మామను హత్య చేయించింది. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని నాగ్పూర్లో కొద్దిరోజుల క్రితం చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. నాగ్పూర్కు చెందిన పురుషోత్తం పుట్టేవార్(82)కు రూ. 300 కోట్ల ఆస్తి ఉంది. ఆయన కుమారుడు మనీష్ డాక్టర్ కాగా, కోడలు అర్చన మనీష్ పుట్టేవార్ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా ఉద్యోగం చేస్తున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం పురుషోత్తం భార్య శకుంతల ఆస్పత్రి పాలైంది. ఆమెకు సర్జరీ నిర్వహించగా, భార్యను చూసేందుకు పురుషోత్తం ఆస్పత్రికి వెళ్లారు. ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో ఆయన రోడ్డు ప్రమాదానికి గురై చనిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
దర్యాప్తులో భాగంగా పురుషోత్తంను ఢీకొట్టి చంపిన కారును గుర్తించారు పోలీసులు. ఆ డ్రైవర్ను కూడా అరెస్టు చేశారు. ఆ డ్రైవర్ అర్చన భర్త మనీష్ కారు డ్రైవర్గా తేలింది. దీంతో అతని లోతుగా ప్రశ్నించగా, అర్చననే ఈ హత్యకు కారకురాలని నిర్ధారణ అయింది. పురుషోత్తంను హత్య చేసేందుకు తనకు రూ. కోటి సుఫారీ ఇచ్చిందని డ్రైవర్ బాగ్డే తెలిపాడు. తనతో పాటు నీరజ్, సచిన్ ధార్మిక్కు ఈ హత్యలో ప్రమేయం ఉందన్నాడు. ఇక పురుషోత్తంను చంపేందుకే సెకండ్ హ్యాండ్ కారును అర్చన కొనుగోలు చేసిందని తేలింది. దీంతో అర్చనతో పాటు బాగ్డే, నీరజ్, ధార్మిక్ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల నుంచి రెండు కార్లు, బంగారు ఆభరణాలు, మొబైల్స్ను పోలీసులు సీజ్ చేశారు.