Wife Kills Husband | వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న కోపంతో తమ్ముడు, తన సన్నిహితుడితో కలిసి భర్తను ఓ భార్య హత్య చేయించింది. ఈ సంఘటన ఆదివారం అర్ధరాత్రి యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కాటేపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మకూరు మండలం పల్లెర్ల గ్రామానికి చెందిన వస్తుపుల స్వామి(38)కిమోత్కూరు మండలం దాచారం గ్రామానికి చెందిన స్వాతితో వివాహం అయింది. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. స్వామి భువనగిరి పట్టణంలోని ఓ ట్రాక్టర్ షోరూంలో మేనేజర్గా పనిచేస్తున్నాడు. తన స్నేహితుడు వీరబాబుతో కలిసి భువనగిరిలో పనులు ముగించుకుని ఆదివారం అర్ధరాత్రి స్వగ్రామానికి తన బైక్ పై బయలుదేరాడు. రాయగిరి-మోత్కూరు ప్రధాన రహదారి కాటేపల్లిలోని బ్రిడ్జి దాటగానే వెనుకనుంచి వేగంగా వచ్చిన ఓ కారు స్వామి బైకును బలంగా ఢీకొట్టి.. 50మీటర్ల దూరం ఈడ్చుకువెళ్లింది. దీంతో స్వామి అక్కడికక్కడే మృతిచెందగా, వీరబాబుకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమివ్వగా, మేరుగైన చికిత్స నిమిత్తం వీరబాబును హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
ఈ ప్రమాదంపై తమకు అనుమానం ఉందని, స్వామిని భార్య తరుపువారే హత్య చేసి ఉంటారని స్వామి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు స్వామి భార్య స్వాతి, బావమరిది మహేష్ ను అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయం బయటపడింది. తుర్కపల్లి మండలం పల్లెపహాడ్ కు చెందిన సాయికుమార్తో స్వామి భార్యకు కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది..దీంతో భర్త స్వామిని అడ్డు తొలగించుకునేందుకు తమ్ముడు మహేష్, తనతో సన్నిహితంగా ఉండే యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం పల్లెపహాడ్ కు చెందిన సాయికుమార్ తో కలిసి ప్రణాళిక రూపొందించి హత్య చేయించినట్లు స్వాతి ఒప్పుకుంది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని అనుకునేలా పథకం పన్ని హత్య చేయించారు. ఈ కేసులో స్వాతి, మహేష్ లను పోలీసులు అదుపులోకి తీసుకోగా వాహనం నడిపిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.