Site icon vidhaatha

Chardham Yatra | ప్రారంభమైన శీతాకాలం.. గంగోత్రి ధామ్‌ తలుపులు నేడు మూసివేత..

Chardham Yatra | చార్‌ధామ్‌లో ఓ క్షేత్రమైన గంగోత్రి ధామ్‌ ద్వారాలు మూతపడనున్నాయి. శీతాకాలం సందర్భంగా శనివారం మధ్యాహ్నం 12.14 గంటలకు ద్వారాలను ఆలయ తలుపులను మూసివేయనున్నారు. ఇకపై గంగోత్రిలో కొలువైన అమ్మవారు శీతాకాల విడిది అయిన ముఖబాలోని గంగా మందిర్‌లో కనిపించనున్నారు. భాయి దూజ్‌ పండుగ సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం 12.05 గంటలకు యమునోత్రి ధామ్‌ తలుపులను మూసివేయనున్నారు. శుక్రవారం దీపోత్సవంతో భగవతీ గంగామాత గంగోత్రి ధామ్‌ తలుపులు మూసివేసే ప్రక్రియ ప్రారంభమైందని శ్రీ పంచ గంగోత్రి మందిర సమితి కార్యదర్శి సురేష్‌ సెమ్వాల్‌ తెలిపారు. తలుపులు మూసిన తర్వాత గంగామాత ఉత్సవ విగ్రహాన్ని డోలీ యాత్రతో ముఖబా వద్దకు తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు యమునోత్రి ధామ్ తలుపులు మూసేసేందుకు సన్నాహాలు కూడా ప్రారంభమయ్యాయి.

ఆదివారం యమునోత్రి ధామ్ తలుపులు మూసివేసిన తర్వాత మాత మయునా ఉత్సవ విగ్రహాన్ని ఖర్సాలీ గ్రామానికి తీసుకువెళ్తారు. శీతాకాలం మొత్తం అక్కడే పూజలు అందుకోనున్నారు. శీతాకాల విడిది సందర్భంగా రెండు ధామ్‌లను పూలను అలంకరించారు. ఛార్‌ధామ్‌ యాత్ర మొదలైనప్పటి నుంచి శుక్రవారం సాయంత్రం వరకు 15 లక్షల 21వేల 752 మంది పర్యాటకులు రెండు ధామ్‌లను దర్శించుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు. ఇందులో 7.10 లక్షల మంది యాత్రికులు యమునోత్రి ధామ్‌ను సందర్శించగా, గంగోత్రి ధామ్‌ను 8.11 లక్షల మంది సందర్శించినట్లు వివరించారు. చార్‌ధామ్‌లో కీలకమైన కేదార్‌నాథ్‌ ఆలయాన్ని 3న ఉదయం 8.30 గంటలకు మూసివేస్తారు. గర్వాల్‌ హిమాలయాల్లో ఉన్న ఈ ధామ్‌ను చార్‌ధామ్‌ యాత్రలో ఎక్కువగా సందర్శించే ఆలయాల్లో ఒకటి. ఇక విష్ణువు కొలువైన బద్రీనాథ్‌ ధామ్‌ను నవంబర్‌ 17న రాత్రి 9.07 గంటలకు మూసివేస్తారు.

Exit mobile version