Site icon vidhaatha

Deepavali 2024 | దీపావ‌ళి వేళ‌.. ఏ ప్ర‌మిద‌లో దీపం వెలిగిస్తే ఏం లాభం క‌లుగుతుందో తెలుసా..?

Deepavali 2024 | దీపావ‌ళి పండుగ( Deepavali Festival ) వేళ‌.. దీపాలంక‌ర‌ణ‌కు అత్యంత ప్రాధాన్య‌త ఇస్తారు. ఎందుకంటే ఇప్ప‌టి వ‌ర‌కు జీవితంలో నెల‌కొన్న చీక‌ట్ల‌ను పార‌దోలి వెలుగులు నింపాల‌ని ప్రార్థిస్తూ దీపావ‌ళి( Deepavali ) పండుగ‌ను జ‌రుపుకుంటారు. దేశ వ్యాప్తంగా దీపావ‌ళి పండుగ‌ను ఘ‌నంగా నిర్వ‌హిస్తారు. ప్ర‌తి ఇంటిని దీపాలంక‌ర‌ణ చేయ‌డంతో.. ప్ర‌తి ఇల్లు దీప‌పు కాంతుల‌తో వెలిగిపోతోంది. ఇక ల‌క్ష్మీదేవి పూజ( Lakshmi Devi Puja ) సంద‌ర్భంగా ప్ర‌మిద‌ల్లో దీపం వెలిగిస్తుంటారు. ఒక్కో ప్ర‌మిద‌లో ఒక్కో దీపం వెలిగిస్తే ఒక్కో ర‌క‌మైన లాభం క‌లుగుతుంద‌ని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మ‌రి ఏ ప్ర‌మిదలో దీపం వెలిగిస్తే ఏం ప్ర‌యోజ‌నం చేకూరుతుందో తెలుసుకుందాం..

బంగారు ప్రమిద

బంగారు ప్రమిదలో ఆవు నెయ్యి పోసి దీపం వెలిగిస్తే పిల్లలకు చదువు బాగా వస్తుందని, ముఖ్యంగా పోటీ పరీక్షల్లో మెరుగైన ప్రతిభను కనబరుస్తారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అలాగే ధన లాభం క‌లుగుతుంద‌ట‌. బంగారం కొనుగోలు చేసే శక్తి కూడా పెరిగే అవ‌కాశం ఉంటుంద‌ని చెబుతున్నారు. ఇవన్నీ జరగాలంటే చిన్న సైజు బంగారు ప్రమిదలో సన్నటి వత్తితో దీపం పెడితే సరిపోతుందని పండితులు సూచిస్తున్నారు.

వెండి ప్రమిద

చాలా మంది దీపావళి రోజు పూజా మందిరంలో వెండి ప్రమిదలో దీపం వెలిగిస్తుంటారు. దీంతో ఇంటి యజమానికి అనేక మార్గాల్లో ధనాదాయం పెరుగుతుందని జ్యోతిష్య పండితులు పేర్కొంటున్నారు.

రాగి ప్రమిద

దీపావళి రోజు ఇంటి ముందు రాగి ప్రమిదలో దీపాన్ని వెలిగిస్తే మనోధైర్యం పెరుగుతుందని చెబుతున్నారు. అంతేకాకుండా ఆ ఇంట చ‌ల్ల‌ని వాతావ‌ర‌ణాన్ని కూడా క‌లిగిస్తుంద‌ని పండితులు సూచిస్తున్నారు.

కంచు ప్రమిద

ఈ రోజుల్లో చాలా మంది డబ్బు వచ్చినట్లే వచ్చి వెళ్లిపోతుందని బాధపడుతుంటారు. ఇలాంటి వారు కంచు ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఇంటి ముందు దీపం వెలిగిస్తే ధనానికి స్థిరత్వం ఉంటుందని పండితులు చెబుతున్నారు.

మట్టి ప్రమిద

సహజంగా దీపావళి రోజు ఇంటి ముందు భాగంలో అందరూ మట్టి ప్రమిదలో దీపం వెలిగిస్తుంటారు. ఇలా మట్టి ప్రమిదలో దీపం వెలిగించడం వల్ల పాపాలన్నీ తొలగిపోతాయని వివరిస్తున్నారు. నర దోషం, నర పీడ, దృష్టి దోషం నుంచి బయట పడవచ్చని జ్యోతిష్య పండితులు పేర్కొంటున్నారు.

tags –

Exit mobile version