TTD | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంలో క్రోధినామ సంవత్సరం సందర్భంగా మంగళవారం ఉగాది ఆస్థానం వేడుకగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఉదయం శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామివారికి, విష్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేశారు. విమాన ప్రాకారం.. ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశించారు. శ్రీవారి ఉత్సవర్లను బంగారు వాకిలిలో గరుడాళ్వారుకు అభిముఖంగా సర్వభూపాల వాహనంపై వేంచేపు చేశారు. శ్రీవారి ఉత్సవర్ల పక్కనే మరో పీఠంపై స్వామివారి సర్వసైన్యాధ్యక్షులు విశ్వక్సేనుల వారిని వేంచేపు చేశారు.
ఆ తర్వాత శ్రీవారి మూలవిరాట్టుకు, ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలను ధరింపచేశారు. అనంతరం పంచాంగ శ్రవణం నిర్వహించారు. బంగారు వాకిలి వద్ద ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా ఉగాది ఆస్థానం జరిపారు. కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఈవో మీడియా మాట్లాడారు. భక్తులందరికీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచం, దేశం, రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు. శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు వివరించారు.