TTD | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్. అక్టోబర్ మాసానికి సంబంధించిన ఆర్జిత సేవా టికెట్ల గురువారం (జూలై 18)న టీటీడీ విడుదల చేయనున్నది. ఉదయం 10 గంటల నుంచి ఈ నెల 20న ఉదయం పది గంటలకు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన లక్కీడీప్ కోసం పేర్లను రిజిస్టర్ చేసుకోవాలని టీటీడీ పేర్కొంది. 20న లక్కీ డిప్లో టికెట్లు పొందిన భక్తులు 22న మధ్యాహ్నం 12 గంటలోగా డబ్బులు చెల్లించి టికెట్లను ఖరారు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పింది. ఈ నెల 22న ఉదయం 10 గంటలకు శ్రీవారి ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేస్తామని పేర్కొంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లను అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొంది.
ఈ నెల 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్లు, ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు దాతల దర్శనం, వసతి గదుల కోటాను విడుదల చేయనున్నది. మధ్యాహ్నం 3 గంటలకు సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారి కోటా టికెట్లను విడుదల చేయనున్నట్లు చెప్పింది. ఈ నెల 24న ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు, అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వసతి గదుల కోటాను టీటీడీ విడుదల తెలిపింది. ఈ నెల 27న ఉదయం 11 గంటలకు తిరుమల, తిరుపతి శ్రీవారి స్వచ్ఛంద సేవా జనరల్ కోటాను, మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ కోటాను, మధ్యాహ్నం ఒంటి గంటకు పరకామణి సేవ కోటాను ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు తెలిపింది. భక్తులు ttdevasthanams.ap.gov.in వెబ్సైట్లో టికెట్లను బుక్ చేసుకోవాలని దేవస్థానం కోరింది.