Ugadi -2024 | తెలుగునాట కాలగమనం.. షడ్రుచుల సమ్మేళనం ఉగాది

  • Publish Date - April 9, 2024 / 08:08 AM IST

Ugadi -2024 | తెలుగు సంవత్సరాది.. ఉగాది వచ్చింది.. క్రోధి నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ శోభకృత్నామ సంవత్సరం వెళ్లిపోతున్నది. ఈ పర్వదినం తమ జీవితాల్లో కోటి కాంతులు నింపాలని కోరుకుంటూ ‘ఉగాది’ని ఘనంగా నిర్వహించుకునేందుకు తెలుగు ప్రజలు సిద్ధమయ్యారు. వివిధ ప్రాంతాల్లో పంచాంగ పఠనాలు, పచ్చళ్ల పంపిణీ, ఆలయాల్లో ప్రత్యేక పూజల కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి.

మరో వసంతాన్ని స్వాగతించడమే పరమార్థం..

గడిచిన ఏడాదికి వీడ్కోలు పలుకుతూ, రాబోయే సంవత్సరం తమ జీవితాల్లో కొత్త కాంతులను నింపాలనే ఆకాంక్షతో మరో వసంతాన్ని స్వాగతించడమే ఉగాది పరమార్థం. తెలుగు నాట కాలగమనం ప్రారంభమైంది ఈ రోజునే కావడం విశేషం. సకల చరాచర సృష్టికి బ్రహ్మదేవుడు బీజం వేసింది ఈ రోజునేనంటారు. నిజానికి ఈ ‘యుగాదే’ కాల ప్రవాహంలో ‘ఉగాది’గా పరిణమించిందని చెబుతారు. సంప్రదాయ వాదుల మధ్య సౌహార్ద్రతను, సన్నిహితులు, శ్రేయోభిలాషుల మధ్య ఉల్లాసాన్ని ద్విగుణీకృతం చేసే ఈ అపురూప వేడుకను ఘనంగా జరుపుకునేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలు రెడీ అయ్యారు. ఇళ్లను మామిడి తోరణాలతో అలంకరించి, షడ్రుచుల సమ్మేళన ఉగాది పచ్చడిని స్వీకరించి, బూరెలు లాగించి, కబుర్లలో మునిగితేలనున్నారు. దేవాలయాలు ప్రత్యేక శోభను సంతరించుకోగా, వేద పండితుల పంచాంగ పఠణాలు చేసి భవిష్యత్ను ఆవిష్కరించనున్నారు.

అన్నింటా తొలి పండుగ..

తెలుగువారి పండుగల్లో ఉగాది తొలి పండుగ. ఈ పండుగ పుట్టుకకు సంబంధించి అనేక పురాణగాథలున్నాయి. వేదాలను తస్కరించిన సోమకాసురుడి బారి నుంచి వాటిని కాపాడి, బ్రహ్మదేవుడికి అప్పగించేందుకు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం దాల్చాడని పౌరాణిక గాథ. శ్రీ మహావిష్ణువు చైత్రశుద్ధ పాఢ్యమి నాడే మత్స్యావతారం ఎత్తాడని చెబుతారు. కనుకే శ్రీ మహావిష్ణువు అవతార గుర్తుగా ఈ పండుగ జరుపుకుంటారని పురాణాలు ప్రవచిస్తున్నాయి. ఈ రోజే బ్రహ్మ సృష్టికి శ్రీకారం చుట్టాడంటారు. చైత్రశుద్ధ పాఢ్యమి నాటికి ద్వాపర యుగం పూర్తయి కలియుగం ప్రారంభమైందనీ, కృష్ణావతారం ముగిసిన ఆ రోజే భువిలో కలి ప్రవేశించిందని, అందు వల్ల ఉగాదిని ఆ రోజు జరుపుకోవడం ఆచారమైందని చెబుతారు. ఈ రోజు ఉదయాన్నే స్నానం చేసి, ఉగాది పచ్చడి తయారు చేసి, దైవానికి నైవేద్యంగా సమర్పించాకే స్వీకరించాలి. పచ్చడిలో చేదు, తీపి, పులుపులను జీవితంలోని సుఖ దుఃఖాలకు అన్వయిస్తారు. జీవితం అంటే అన్ని రుచుల సమ్మేళనంలాంటిదన్న వేదాంత సారాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది.

ఉగాది పచ్చడి.. ప్రత్యేకం

ఉగాది వేడుకల్లో ఆధ్యాత్మిక, ధార్మిక చింతన భావాలతో పాటు ఆరోగ్య సూత్రాలూ మిళితమై ఉన్నాయి. ఆరు రుతువుల్లో సహజంగా వాత, పిత్త, కఫ దోషాలు కలుగుతాయి. వీటిని ఆయుర్వేద నిపుణులు త్రిదోషాలుగా పేర్కొంటారు. వసంత రుతువులో కఫం ప్రకోపిస్తుంది. దాన్ని నివారించేందుకు కటు, తిక్త, కషాయ రసాలు ఉపకరిస్తాయి. అందుకే ఉగాదిన సంపూర్ణ ఆరోగ్యానికి షడ్రుచులను పచ్చడి రూపంలో స్వీకరిస్తారు. ఉగాది పచ్చడిలో వినియోగించే వస్తువుల్లో కొత్త బెల్లం, కొత్త చింతపండు, ఉప్పు, మామిడికాయలు, పచ్చిమిరప, వేపపువ్వు ప్రాశస్త్యం పొందాయి. వీటినే బెల్లం (తీపి), చింత (పులుపు), లవణం (ఉప్పు), కటువు (కారం), తిక్తం (చేదు), కషాయం (వగరు) అనే షడ్రుచుల మేళవంగా పేర్కొంటారు. భిన్నమైన రుచులను ఒక చోట చేర్చడం జీవితంలోని సమన్వయత్వానికి సంకేతం. ఈ పండుగ వచ్చేటప్పటికి రుతువుల్లోని తేడా వల్ల కొంత అనారోగ్యం కలుగుతుంది. ఆ అనారోగ్యాన్ని తొలగించేదే ఉగాది పచ్చడి.

పంచాంగ శ్రవణం..

ఈ రోజు ముఖ్యమైన ఆచారం పంచాంగ శ్రవణం. పంచాంగం అంటే తిథి, వార, నక్షత్ర, యోగ, కరణం అనే ఐదు అంశాలు గల శాస్త్రం. పంచాంగ శ్రవణం ద్వారా తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ ఫలితాలను తెలుసుకుంటే గంగా స్నాన ఫలం కలుగుతుంది. భూమిని, బంగారాన్ని, గోవులను, ఏనుగులను మొదలైన వాటిని దానమిస్తే కలిగే ఫలం పంచాంగ శ్రవణం వల్ల కలుగుతుందని పండితులు చెబుతుంటారు. హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలో ఉగాది ఒకటి. ముఖ్యంగా ఈ ఫెస్టివల్ను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రల్లో వైభవంగా జరుపుకుంటారు. ఈ పండుగను. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో ’ఉగాది’గా, మహారాష్ట్రలో ’గుడి పడ్వా’గా, తమిళనాడులో ’పుత్తాండు’ అనే పేరుతో, మలయాళీలు ’విషు’ అనే పేరుతోను, సిక్కులు ’వైశాఖీ’ గానూ, బెంగాలీలు ’పొయ్లా బైశాఖ్’గానూ జరుపుకుంటారు.

Latest News