Vasantotsavalu | నెలాఖరులో తిరుమలకు వెళ్తున్నారా..? ఈ ఛాన్స్‌ అస్సలు మిస్సవ్వొద్దు..!

Vasantotsavalu | ఈ నెల 27 నుంచి 29 వరకు శ్రీనివాసమంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో వార్షిక వసంతోత్సవాలు జరుగనున్నాయి. వేడుకల్లో ప్రతిరోజూ ఉదయం 8.30 గంటలకు ఉత్సవర్లు ఆలయం నుంచి వసంత మండపానికి వేంచేపు చేస్తారు. తొలి రెండు రోజులు శ్రీవారు ఉభయనాంచారులతో కలిసి వసంతోత్సవంలో పాల్గొంటారు.

Reported by: Mallanna | ఆధ్యాత్మికం | May 20, 2024, 9:55 am IST
Read Time: 3 mins
Vasantotsavalu | నెలాఖరులో తిరుమలకు వెళ్తున్నారా..? ఈ ఛాన్స్‌ అస్సలు మిస్సవ్వొద్దు..!

Vasantotsavalu | ఈ నెల 27 నుంచి 29 వరకు శ్రీనివాసమంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో వార్షిక వసంతోత్సవాలు జరుగనున్నాయి. వేడుకల్లో ప్రతిరోజూ ఉదయం 8.30 గంటలకు ఉత్సవర్లు ఆలయం నుంచి వసంత మండపానికి వేంచేపు చేస్తారు. తొలి రెండు రోజులు శ్రీవారు ఉభయనాంచారులతో కలిసి వసంతోత్సవంలో పాల్గొంటారు. చివరి రోజు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి, సీతాలక్ష్మణ హనుమాన్‌ సమేత శ్రీరామచంద్రమూర్తి, రుక్మిణీ సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామివార్ల ఉత్సవమూర్తులను వసంత మండపానికి వేంచేపుగా తీసుకొచ్చి వేదపండితులు శాస్త్రోక్తంగా ఆస్థానం నిర్వహిస్తారు.

వసంత రుతువులో లభించే పుష్పాలు, ఫలాలను సమర్పించి స్వామివారి దివ్యానుగ్రహం పొందడమే ఈ వసంతోత్సవం అంతరార్థం. రెండో రోజు 28న సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు స్వర్ణ రథోత్సవం కన్నులపండువగా జరుగనుంది. ప్రతిరోజూ మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు స్నపన తిరుమంజనం, సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు ఊంజలసేవ, రాత్రి 7 నుంచి 8 గంటల వరకు వీధి ఉత్సవం నిర్వహిస్తారు. వసంతోత్సవంలో పాల్గొనేందుకు భక్తులకు అవకాశం కల్పించింది. దంపతులకు రూ.516గా టికెట్‌ ధర నిర్ణయించారు. ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందించనున్నారు. వసంతోత్సవాల సందర్భంగా ఈ నెల 27 నుంచి 29 వరకు టీటీడీ కల్యాణోత్సవం, 28న స్వర్ణపుష్పార్చన, మే 29న అష్టోత్తర శతకలశాభిషేకం ఆర్జితసేవలను టీటీడీ రద్దు చేసింది.