యాదాద్రి ఆలయంలో భక్తులకు డ్రెస్ కోడ్‌.. జూన్ 1నుంచి అమలులోకి

తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులకు ఇకనుంచి డ్రెస్ కోడ్ తప్పనిసరి కానుంది.

యాదాద్రి ఆలయంలో భక్తులకు డ్రెస్ కోడ్‌.. జూన్ 1నుంచి అమలులోకి

ఈవో భాస్కర్‌రావు వెల్లడి

విధాత: తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులకు ఇకనుంచి డ్రెస్ కోడ్ తప్పనిసరి కానుంది. నరసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించాలని యాదగిరిగుట్ట దేవస్థానం నిర్ణయించింది. వివిధ సేవల్లో పాల్గొనే భక్తులు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులు ధరించే నియమం జూన్ 1 నుంచి అమల్లోకి రానుంది. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం తర్వాత లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునే భక్తుల సంఖ్య పెరుగుతోంది. టీటీడీ తరహాలో హిందూ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించేలా చర్యలు చేపట్టాలని యాదగిరిగుట్ట దేవస్థానం నిర్ణయించింది.

ఆలయంలో ఇప్పటికే ఆలయ ఈవోతోపాటు సిబ్బంది కూడా డ్రెస్ కోడ్‌ను పాటిస్తున్నారు. ఇక మీదట నిత్య కల్యాణం, హోమం, జోడు సేవలు, శ్రీసుదర్శన నారసింహ హోమం, శ్రీసత్యనారాయణ స్వామి వ్రతాలు తదితర ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించేలా నియమాన్ని అమలు చేయనున్నుట్లుగా దేవస్థానం ఈవో భాస్కర్ రావు తెలిపారు. స్వామి వారి బ్రేక్ దర్శనానికి వచ్చే భక్తులకు కూడా తప్పనిసరిగా ఈ నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేశారు. అయితే సాధారణ ధర్మ దర్శనం క్యూలైన్‌లో వచ్చే భక్తులకు ఈ నియమం నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపారు.

యాదగిరిగుట్ట ఆలయంలో జూన్ 1 నుంచి డ్రెస్ కోడ్ నియమాన్ని కచ్చితంగా అమలు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆలయంలో ఆధ్యాత్మికత, భక్తి భావాన్ని పెంచేందుకే ఇలాంటి నియమాలు అమలు చేస్తున్నామన్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు యాదాద్రీశుడి క్షేత్ర మహత్యం తెలిపేలా సైన్ బోర్డులను ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు, బోర్డులోనే క్యూఆర్ కోడ్‌ స్కాన్ చేస్తే ఫోన్‌లో తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో క్షేత్ర మహత్మ్యం వివరాలు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఈవో భాస్కర్ రావు తెలిపారు. జూన్ 1వ నుంచి అమలయ్యే సంప్రదాయ వస్త్రధారణకు భక్తులందరూ సహకరించాలని ఆయన కోరారు.