Manchu Vishnu | దుబాయ్‌లో మిస్సైల్స్ కలకలం.. మంచు విష్ణు షేర్ చేసిన వీడియో వైరల్

Manchu Vishnu | ఇరాన్‌పై ఇజ్రాయెల్‌, అమెరికా సంయుక్తంగా నిర్వహిస్తున్న దాడులు, వాటికి ప్రతిగా ఇరాన్ చేపడుతున్న ప్రతిదాడులతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

  • By: sn |    movies |    Published on : Mar 01, 2026 8:14 AM IST
Manchu Vishnu | దుబాయ్‌లో మిస్సైల్స్ కలకలం.. మంచు విష్ణు షేర్ చేసిన వీడియో వైరల్

Manchu Vishnu | ఇరాన్‌పై ఇజ్రాయెల్‌, అమెరికా సంయుక్తంగా నిర్వహిస్తున్న దాడులు, వాటికి ప్రతిగా ఇరాన్ చేపడుతున్న ప్రతిదాడులతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతున్నట్లు సమాచారం. ఈ పరిణామాల ప్రభావం గల్ఫ్ దేశాలపై స్పష్టంగా కనిపిస్తోంది. ప్రత్యేకంగా దుబాయ్, రియ‌ద్, అబు దుబాయ్, దోహ‌, మ‌న‌మ నగరాల్లో భద్రతా హెచ్చరికలు జారీ అయ్యాయి. యూఏఈలోని దుబాయ్ గగనతలంలో మిస్సైల్స్ దూసుకురావడం స్థానికులను భయాందోళనలకు గురిచేసింది.

టాలీవుడ్ హీరో మంచు విష్ణు ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి దుబాయ్‌లో ఉన్నారు. ఇరాన్ ప్రయోగించిన క్షిపణుల శబ్దంతో తాము ఉన్న ఇల్లు కంపించిందని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఆకాశంలో కనిపించిన మిస్సైల్స్ దృశ్యాలను కూడా పంచుకున్నారు. “ఈ రాత్రి దుబాయ్‌లో కుటుంబ సభ్యులతో ఉన్నాను. ఆకాశంలో కనిపిస్తున్న క్షిపణుల వల్ల మేము ఉన్న ఇల్లు షేక్ అయింది. ఆ శబ్దాలకు నా కుమార్తె ఐరా చాలా భయపడింది. శాంతి కోసం ప్రార్థిస్తున్నాం. ఏ బిడ్డ కూడా యుద్ధ శబ్దం విని పెరగకూడదు. పౌరులను సురక్షితంగా ఉంచినందుకు యూఏఈ రక్షణ దళాలకు కృతజ్ఞతలు. ఇలాంటి క్షణాలు జీవితం ఎంత దుర్బలమో గుర్తు చేస్తాయి. బలం కోసం, శాంతి కోసం ప్రార్థిస్తున్నాం. హర్ హర్ మహాదేవ్” అని విష్ణు పేర్కొన్నారు.

ఆయన షేర్ చేసిన వీడియోలో గగనతలంలో మిస్సైల్స్ కదలికలు స్పష్టంగా కనిపించాయి. ఆ సమయంలో కుటుంబ సభ్యుల్లో భయం నెలకొన్నట్లు అర్థమవుతోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విష్ణు కుటుంబం సురక్షితంగా ఉండాలని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త సైనిక చర్యల నేపథ్యంలో పశ్చిమాసియాలోని భారత రాయబార కార్యాలయాలు అప్రమత్తమయ్యాయి. యూఏఈ, సౌదీ అరేబియా, జోర్డాన్ తదితర దేశాల్లోని భారత ఎంబసీలు అక్కడి భారత పౌరులకు అడ్వైజరీలు జారీ చేశాయి.

యూఏఈలో ఉన్న భారతీయులు అనవసర ప్రయాణాలు మానుకోవాలని, స్థానిక అధికారుల భద్రతా మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. పరిస్థితులు సాధారణం అయ్యే వరకు అత్యంత జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా దుబాయ్ నుంచి విమాన సేవలు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి.