Ram Charan | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతోంది. ‘ఉప్పెన’ సినిమాతో దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బుచ్చిబాబు సనా తెరకెక్కించిన ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంది. విడుదలైన తొలి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా కలెక్షన్ల పరంగానూ బలమైన ప్రదర్శన కనబరుస్తోంది.

రామ్ చరణ్ కెరీర్‌లో మరో ప్రత్యేక చిత్రంగా నిలుస్తున్న ‘పెద్ది’లో ఆయన నటనకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. క్రికెటర్‌గా, కుస్తీ పోరాట యోధుడిగా, అథ్లెట్‌గా విభిన్న కోణాల్లో కనిపించిన చరణ్ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో భావోద్వేగభరితమైన నటనతో అభిమానులను కదిలించారని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇప్పటికే రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.180 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. దీంతో ‘పెద్ది’ ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

రామ్ చరణ్ ఫ‌స్ట్ చాయిస్ కాదా..

అయితే సినిమా విజయంతో పాటు సోషల్ మీడియాలో మరో ఆసక్తికర ప్రచారం వైరల్ అవుతోంది. అదేంటంటే.. ‘పెద్ది’ కథకు రామ్ చరణ్ మొదటి ఎంపిక కాదని, ఆయన కంటే ముందుగా పలువురు స్టార్ హీరోలకు దర్శకుడు బుచ్చిబాబు కథ వినిపించారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

సోషల్ మీడియాలో వినిపిస్తున్న ప్రచారం ప్రకారం, మొదట ఈ కథను జూనియర్ ఎన్టీఆర్ కు వినిపించారట. అయితే అప్పటికే ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో ఆయన ఈ సినిమాను చేయలేకపోయారని చెబుతున్నారు. అనంతరం అల్లు అర్జున్ వద్దకు కూడా కథ వెళ్లిందని, కానీ పాన్ ఇండియా చిత్రాల కమిట్‌మెంట్ల కారణంగా ఆయన కూడా ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లలేదని ప్రచారం జరుగుతోంది.

బాలీవుడ్ హీరో కూడానా..

ఇక తమిళ స్టార్ హీరో సూర్య‌, బాలీవుడ్ నటుడు ర‌ణ‌బీర్ క‌పూర్ పేర్లు కూడా ఈ జాబితాలో వినిపిస్తున్నాయి. వివిధ కారణాలతో వీరు కూడా ఈ కథను అంగీకరించలేదని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ ప్రచారం ప్రకారం, చివరికి బుచ్చిబాబు ఈ కథను రామ్ చరణ్‌తో పాటు మెగాస్టార్ చిరంజీవికు వినిపించగా, కథ నచ్చడంతో వెంటనే ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ లభించిందట. ఆ తర్వాతే ‘పెద్ది’ సినిమా పట్టాలెక్కిందని చెబుతున్నారు.

అయితే ఈ వార్తలపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అందువల్ల ఇవన్నీ ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంగానే పరిగణించాలి. ఇందులో ఎంతవరకు నిజం ఉందనేది సంబంధిత వ్యక్తులు స్పందిస్తేనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

భారీ తారాగణంతో తెరకెక్కిన ‘పెద్ది’

మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు, ఇషాన్ సక్సేనా ఈ చిత్రాన్ని నిర్మించారు. బాలీవుడ్ నటి జాన్వీ క‌పూర్ కథానాయికగా నటించగా, కన్నడ స్టార్ శివ‌రాజ్ కుమార్, జ‌గ‌ప‌తి బాబు, రావు ర‌మేష్ , దివ్యేందు త్రిపాఠి, సత్య, చమ్మక్ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషించారు.

ఆస్కార్ విజేత ఏఆర్ రెహ‌మాన్ సంగీతం అందించిన ఈ చిత్రానికి అన్ని విభాగాల నుంచి మంచి స్పందన లభిస్తోంది. సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతుండగా, రామ్ చరణ్ నటన మరోసారి చర్చనీయాంశంగా మారింది.