చలి గజగజ వణికిస్తోంది. దీనికి తోడు కరోనా మళ్లీ అలజడి సృష్టిస్తోంది. చలిని, కరోనాను ఎదుర్కొనేందుకు రకరకాల కషాయాలను సేవిస్తుంటారు.
విధాత: చలి గజగజ వణికిస్తోంది. దీనికి తోడు కరోనా మళ్లీ అలజడి సృష్టిస్తోంది. చలిని, కరోనాను ఎదుర్కొనేందుకు రకరకాల కషాయాలను సేవిస్తుంటారు. బ్లాక్ టీ, గ్రీన్ టీ, అల్లం చాయ్, హెర్బల్ టీతో పాటు పలు కషాయాలను తీసుకుంటుంటారు. అయితే జామ ఆకు టీ తాగడం వల్ల కూడా శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చలికాలంలో జామ ఆకు టీ తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని సూచిస్తున్నారు.
జామ ఆకుల్లో విటమిన్ సీ అధికస్థాయిలో ఉంటుంది. విటమిన్ సీ రోగ నిరోధక శక్తిని పెంపొందించడంతో పాటు ఇన్ఫెక్షన్లు సోకకుండా కాపాడుతుంది.
జామ ఆకులలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో కూడిన సహజ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి శ్వాసకోశంలో మంటను తగ్గించడంతోపాటు, దగ్గు, గొంతు నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.
శీతాకాలంలో అజీర్ణం, ఉబ్బరం, మలబద్దకం వంటి జీర్ణ సమస్యలు వేధిస్తుంటాయి. శోథ నిరోధక, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు జామ ఆకుల్లో పుష్కలం. కాబట్టి చలికాలంలో జామఆకు టీ తాగడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
జామ ఆకు టీని క్రమం తప్పకుండా తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేసుకోవచ్చు. వివిధ అధ్యయనాలు ఈ ఆకులు హైపోగ్లైసీమిక్ సమ్మేళనాలను కలిగి ఉన్నాయని నిరూపించాయి. అవి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.
జామ ఆకు టీకి ఒక కప్పు నీరు, 2 నుంచి 3 జామ ఆకులు, తేనే లేదా చక్కెర అవసరం. కప్పు నీటిని మరిగించిన తర్వాత ఆ నీటిలో జామ ఆకులను వేయాలి. 5 నుంచి 7 నిమిషాలపాటు బాగా మరిగించాలి. ఆ ద్రావణాన్ని ఒక కప్పులో వడకట్టాలి. ఆ తర్వాత తేనే లేదా చక్కెరను కలుపుకోని తాగొచ్చు.