గాంధీ భవన్ లో చొక్కాలు పట్టుకున్న నేతలు

గాంధీ భవన్‌లో కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. ఫిరోజ్ ఖాన్, ఉస్మాన్ హజారీ చొక్కాలు పట్టుకుని కొట్టుకోవడం వైరల్ అయింది.

హైదరాబాద్ గాంధీ భవన్ లో బుధవారం జరిగిన హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం సమావేశంలో నాయకులు మధ్య ఘర్షణ వైరల్ గా మారింది. నేతలు పరస్పరం చొక్కాలు పట్టుకుని…చేయి చేసుకుని, తోసివేసుకోవడం ఓ స్ట్రీట్ ఫైట్ ను తలపించింది. ఇదంతా మంత్రులు అజారుద్దీన్, పొన్నం ప్రభాకర్ సమక్షంలో చోటుచేసుకోవడం పార్టీ వర్గాలను విస్మయపరిచింది.

సమావేశంలో మంత్రి అజారుద్దీన్ పక్కన కూర్చునేందుకు ఫిరోజ్ ఖాన్ ప్రయత్నించగా..ఆయనను ఉస్మాన్ హజారీ తోసివేసి చెంపపై కొట్టారు. ఈ గలాటలో ఫిరోజ్ ఖాన్ కిందపోగా రెండు వర్గాల మధ్య తోపులాట నెలకొంది. ఒక్కసారిగా గొడవ ముదిరిపోగా..ఫీరోజ్ ఖాన్, ఉస్మాన్ హజారీలు పరస్పరం చొక్కాలు పట్టుకున్నారు.వారిద్దరిని సీనియర్ నాయకులు, ప్రభుత్వ సలహాదారు వీ. హనుమంత రావు అడ్డుకునే ప్రయత్నం చేయగా..ఆయనను సైతం తోసివేయడంతో కిందపడిపోయారు. దీంతో సమావేశంలో తీవ్రంగా తోపులాట సాగింది.

పరిస్థితి అదుపు తప్పడంతో చేసేది లేక మంత్రులు అజారుద్దీన్, పొన్నంలు ఈ సమావేశాన్ని అర్థాంతరంగా రద్దు చేసుకుని వెళ్లిపోయారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీభవన్ లో జరిగిన ఈ గొడవ మీడియాలో వైరల్ కావడంతో పార్టీ నాయకత్వం సీరియస్ చర్యలకు ఉపక్రమిస్తుందని తెలుస్తుంది. గొడవకు బాధ్యులైన నాయకులకు షోకాజ్ నోటీసులు జారీ చేసి క్రమశిక్షణా చర్యలు తీసుకోనున్నట్లుగా సమాచారం. ఫీరోజ్ ఖాన్,ఉస్మాన్ హజారీ ల మధ్య గతం నుంచి గొడవలు కొనసాగుతుండటంతో ఈ వ్యవహారానికి చెక్ పెట్టాలని పార్టీ నాయకత్వం ఆలోచన చేస్తుందని పార్టీ వర్గాల కథనం. అయితే పార్టీ నాయకులు పరిస్థితి మరింత ముదిరిపోకుండా ఫీరోజ్ ఖాన్, ఉస్మాన్ హజారీల మధ్య సయోధ్య కుదిర్చినట్లుగా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ వెల్లడించారు.

ఇవి కూడా చదవండి :

పట్టపగలే చిమ్మ చీకటి.. ఆగస్ట్‌ 2న ఈ శతాబ్దంలోనే సుదీర్ఘ సూర్య గ్రహణం.. భారత్‌లో?
బాల్క సుమన్ ను వెంటనే అరెస్ట్ చేయాలి: డీజీపీకి బల్మూరి, అద్దంకి ఫిర్యాదు

Latest News