HYDRA : పార్కు స్థలాలను కాపాడిన హైడ్రా
హైదరాబాద్లో పబ్లిక్ పార్కులు, స్థలాలను ఆక్రమణదారుల నుంచి విడిపించడంలో హైడ్రా (HYDRA) తన కార్యాచరణను కొనసాగిస్తోంది. హస్తినాపురంలో 1.27 ఎకరాల పార్కు స్థలాన్ని, చందానగర్ సర్కిల్లో 500 గజాల ప్రజావసరాల స్థలాన్ని హైడ్రా కబ్జాదారుల నుంచి విముక్తి చేసి ఫెన్సింగ్ వేసి బోర్డులు ఏర్పాటు చేసింది.
విధాత, హైదరాబాద్ : నగరంలోని పబ్లిక్ పార్కులు, స్థలాలు, చెరువులు, ప్రభుత్వ భూములను ఆక్రమణదారుల చెర నుంచి విడిపించడంలో హైడ్రా తన జోరు కొనసాగిస్తుంది. హస్తినాపురంలో 1.27 ఎకరాల పార్కు స్థలాన్ని, చందానగర్ సర్కిల్లో 500 గజాల ప్రజావసరాల స్థలాన్ని హైడ్రా కబ్జాదారుల నుంచి విముక్తి చేసింది. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో సంబంధిత అధికారులతో పరిశీలించిన అనంతరం హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారి ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకుంది.
రంగారెడ్డి జిల్లా సరూర్నగర్ మండలం కర్మన్ఘాట్ విలేజ్లోని హస్తినాపురం నార్త్ ఎక్స్టెన్షన్ కాలనీలో 1.27 ఎకరాల పార్కు కబ్జా చేశారంటూ అసోసియేషన్ ప్రతినిధులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. పార్కు స్థలాన్ని లేఔట్లో చూపించి తర్వాత ప్లాట్లుగా విక్రయిస్తున్నారనే ఫిర్యాదును క్షేత్రస్థాయిలో విచారించి ఆక్రమణలను హైడ్రా తొలగించింది. చుట్టూ ఫెన్సింగ్ వేసి హైడ్రా బోర్డులు ఏర్పాటు చేసింది. అలాగే శేరిలింగంపల్లి జోన్ చందానగర్ సర్కిల్ పరిధిలోని గంగారాం కాలనీలో సుభాష్నగర్ పేరిట 1974లో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్లు లే ఔట్ వేశారు. ఇందులో 700 గజాల స్థలాన్ని ప్రజావసరాలకు కేటాయించారు. పేదలకు ఉద్దేశించిన లే ఔట్లో బడాబాబు పాగా వేశారు. ఆ లేఔట్లో ప్రజావసరాలకు ఉద్దేశించిన ఆ స్థలాన్ని ప్లాట్లుగా మార్చాడు. ఇలా ఆక్రమణలకు గురైన స్థలాన్ని కాపాడాలని అక్కడి నివాసితులు ప్రజావాణిలో ఫిర్యాదు చేయగా ఆక్రమణలు తొలగించి హైడ్రా ఫెన్సింగ్ వేసింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram