ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడటమే ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. వరదలు, అగ్నిప్రమాదాలు, పారిశ్రామిక ప్రమాదాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన స్పందన, శాఖల మధ్య సమన్వయం, ముందస్తు సన్నద్ధత ఎంతో కీలకమని అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన విపత్తు నిర్వహణ మాక్ ఎక్సర్సైజ్లలో భాగంగా సోమవారం హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్ హెచ్ఎండీఏ గ్రౌండ్స్ వద్ద నిర్వహించిన భారీ వరద మాక్ డ్రిల్ను సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ… విపత్తులు సంభవించినప్పుడు మొదటి గంట అత్యంత కీలకమని, ఆ “గోల్డెన్ అవర్”లో తీసుకునే చర్యలే ప్రాణాలను కాపాడగలవని పేర్కొన్నారు. అగ్నిప్రమాదాలు, వరదలు, ఆకస్మిక ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, వేగంగా సహాయక చర్యలు చేపట్టడం, అత్యవసర సేవలను సమన్వయం చేయడం కోసం ఇటువంటి మాక్ డ్రిల్లు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. 1908లో హైదరాబాద్ మహావరదలను, ఇటీవలి గోదావరి–కృష్ణా వరదలను ప్రస్తావించిన మంత్రి… విపత్తుల విషయంలో అప్రమత్తత లేకపోతే ఎంతటి నష్టం జరుగుతుందో చరిత్ర చెబుతోందన్నారు.
ఆధునిక పరిజ్ఞానంతో విపత్తుల నివారణ
ప్రజల ప్రాణాలను కాపాడేందుకు సాంకేతిక పరిజ్ఞానం, అత్యాధునిక పరికరాలు, శిక్షణ పొందిన బృందాలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని మంత్రి పొంగులేటి సూచించారు. అడవుల్లో సంభవించే అగ్నిప్రమాదాలు పచ్చదనాన్ని నాశనం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన మంత్రి… పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న అగ్నిప్రమాదాలు కూడా తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా విపత్తుల సమయంలో చేపట్టిన రక్షణ చర్యలను అధ్యయనం చేస్తూ తెలంగాణలో మరింత సమర్థవంతమైన విపత్తు నిర్వహణ వ్యవస్థను రూపొందిస్తున్నామని తెలిపారు.
మాక్ డ్రిల్లో భాగంగా గాలితో నింపే లైఫ్ బోట్లు, నీటిలో చిక్కుకున్న వారిని రక్షించే సాంకేతిక పద్ధతులు, అత్యవసర తరలింపు చర్యలు, సమన్వయంతో కూడిన రెస్క్యూ ఆపరేషన్లను ప్రత్యేక బృందాలు ప్రత్యక్షంగా ప్రదర్శించాయి. అనంతరం మంత్రి నెక్లెస్ రోడ్ బోటింగ్ క్లబ్ ను సందర్శించి రెస్క్యూ కార్యకలాపాలను పరిశీలించారు.
మాక్ డ్రిల్ నిర్వహణపై అభినందనలు
తెలంగాణ రాష్ట్రంలో ఇంత విస్తృత స్థాయిలో మాక్ ఎక్సర్సైజ్లు నిర్వహించడం అభినందనీయమని మంత్రి పేర్కొంటూ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, విపత్తు నిర్వహణ శాఖ, జిల్లా అధికారులను అభినందించారు. ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, ఇవన్నీ పూర్తిగా ముందస్తు సన్నద్ధతలో భాగంగా నిర్వహిస్తున్న మాక్ డ్రిల్లేనని స్పష్టం చేశారు. మీడియా, సోషల్ మీడియా వేదికల ద్వారా బాధ్యతాయుతమైన సమాచారమే ప్రజలకు చేరాలన్నారు.
ఈ కార్యక్రమంలో విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి దాసరి హరిచందన, తెలంగాణ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక శాఖ డీజీ విక్రమ్ సింగ్ మాన్, హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్, ఎన్డీఎంఏ లీడ్ కన్సల్టెంట్ మేజర్ జనరల్ (రిటైర్డ్) సుధీర్ బెల్ పాల్గొన్నారు. పోలీస్, ఫైర్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, రెవెన్యూ, వైద్య ఆరోగ్య, జీహెచ్ఎంసీ, హైడ్రా, పరిశ్రమలు, రవాణా, పశుసంవర్ధక, వెటర్నరీ తదితర శాఖల అధికారులు, సిబ్బంది ఈ మాక్ డ్రిల్లో పాల్గొన్నారు.
▶️జల ప్రాణాల రక్షణే లక్ష్యం… విపత్తులపై తెలంగాణ అప్రమత్తం
▶️అగ్ని ప్రమాదాలు, వరదలు సంభవించినప్పుడు ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు కీలకం
▶️రాష్ట్రవ్యాప్తంగా వరదలు, అటవీ అగ్నిప్రమాదాలు, పారిశ్రామిక ప్రమాదాలపై భారీ మాక్ ఎక్సర్సైజ్లు
▶️నెక్లెస్ రోడ్లో వరద మాక్… pic.twitter.com/H5dK6sIM85
— IPRDepartment (@IPRTelangana) May 18, 2026
ఇవి కూడా చదవండి :
మొయినాబాద్ ఫామ్ హౌస్ లో యువకుడి అనుమానాస్పద మృతి
Heat Wave | నిప్పుల కొలిమిలా తెలంగాణ..! మరో ఏడు రోజులు మండుటెండలే..!!
