పాకిస్థాన్​కు అంత సీన్ లేదు – అమెరికా కూడా నమ్మదు: ఇజ్రాయెల్ సంచలన వ్యాఖ్యలు

NDTV ఇంటర్వ్యూలో ఇజ్రాయెల్ రాయబారి పాకిస్థాన్​పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మేం నమ్మలేం, అమెరికా కూడా పూర్తిగా నమ్మదని చెప్పడంతో అమెరికా–ఇరాన్ చర్చల మధ్య కొత్త వివాదం తలెత్తే అవకాశముంది.

Israel envoy Reuven Azar speaking in NDTV interview about Pakistan trust issue

“పాకిస్తాన్‌పై నమ్మకం లేదు” – NDTV ఇంటర్వ్యూలో ఇజ్రాయెల్ రాయబారి స్పష్టం

Pakistan Not Trusted Even By US: Israel Envoy’s Explosive Remark Before Iran Talks

కీలక అంశాలు

పాకిస్తాన్‌పై మాకు నమ్మకం లేదు : ఇజ్రాయెల్

అమెరికా కూడా పాకిస్తాన్‌ను పూర్తిగా నమ్మడం లేదు

ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో ఇజ్రాయెల్ రాయబారి సంచలన వ్యాఖ్యలు

ఫైనాన్షియల్ టైమ్స్ రిపోర్ట్‌లో అమెరికా ఒత్తిడి అంశం

 

విధాత ప్రపంచం డెస్క్​ | హైదరాబాద్​:

 Israel Envoy on Pakistan | మధ్యప్రాచ్యంలో పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారుతున్న వేళ, అమెరికా–ఇరాన్​ల మధ్య కీలక చర్చలకు పాకిస్థాన్వేదికగా మారడం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. కానీ ఈ పరిణామాల మధ్య ఇజ్రాయెల్ నుంచి వచ్చిన ఒక వ్యాఖ్య దౌత్య వర్గాలను ఆశ్చర్యంలో ముంచింది. భారతదేశంలోని ఇజ్రాయెల్ రాయబారి రేవెన్ అజార్, NDTVకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాకిస్థాన్​పై మాకు నమ్మకం లేదని కుండ బద్దలు కొట్టారు. అమెరికా కూడా పాకిస్థాన్​ను పూర్తిగా నమ్మడం లేదని, కేవలం ఈ విషయంలో దోహదం చేసిన మధ్యవర్తిగా మాత్రమే చూస్తోందని ఆయన చెప్పడం సంచలనంగా మారింది.

ఈ వ్యాఖ్యలు కేవలం మాటలకే పరిమితం కాలేదు. గాజా వంటి సున్నిత ప్రాంతాల్లో పాకిస్థాన్​ సైన్యం పాత్రపై కూడా ఇజ్రాయెల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. హమాస్, లష్కరే తోయిబా వంటి సంస్థలతో పాకిస్థాన్​ సంబంధాలు పెరగడం కూడా ఇజ్రాయెల్​కు నచ్చలేదు. ఇలాంటి నేపథ్యంలో పాకిస్థాన్​ను శాంతి చర్చలకు వేదికగా ఎంచుకోవడం ఎంతవరకు సురక్షితం అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రేవెన్ అజార్ వ్యాఖ్యలు వీటిని ఇంకా బలపరుస్తున్నాయి.

అమెరికా ఒత్తిడితోనే పాక్​ శాంతిదూత పాత్ర?

అమెరికా–పాకిస్తాన్ సంబంధాల మధ్య రాజకీయ సంకేతాలు… ట్రంప్‌తో పాక్ నేతల భేటీ

ఫైనాన్షియల్ టైమ్స్ నివేదిక ప్రకారం, పాకిస్థాన్ స్వతంత్రంగా శాంతిపూర్వక మధ్యవర్తిత్వం చేపట్టలేదనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా ఒత్తిడి కారణంగానే ఇస్లామాబాద్ ఇరాన్‌ను చర్చలకు తీసుకురావడానికి ప్రయత్నించిందని ఈ నివేదిక బయటపెట్టింది. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకునేలా చేయడంలో భాగంగా, తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని సాధించడానికి పాకిస్థాన్​ను ఒక సాధనంగా ఉపయోగించుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పాక్​ పాత్ర తటస్థం కాదనీ, అమెరికా వ్యూహంలో భాగమే అన్న అభిప్రాయం బలపడుతోంది.

కాల్పుల విరమణపై మళ్లీ ఆందోళన

అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతల మధ్య పాక్, ఇజ్రాయెల్ పాత్రలపై ప్రపంచవ్యాప్త చర్చ

ఇక ఇరాన్ మాత్రం ఈ పరిణామాలకు ఇజ్రాయెల్‌ను కారణంగా చూపుతోంది. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు ఇలాగే కొనసాగితే, తాజాగా కుదిరిన రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం రద్దు కావచ్చని హెచ్చరిస్తోంది. హోర్ముజ్ జలసంధిలో మళ్లీ ఉద్రిక్తతలు పెరిగే ప్రమాదం ఉందని కూడా తెలిపింది. మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్ మాత్రం లెబనాన్ ఈ ఒప్పందంలో భాగం కాదని స్పష్టం చేస్తూ తమ వైఖరిని కొనసాగిస్తున్నాయి.

ఈ పరిణామాలన్నింటిని కలిపి చూస్తే, పాకిస్థాన్​పై ప్రపంచ స్థాయిలో విశ్వాసం ప్రశ్నార్థకమేనని స్పష్టమవుతోంది. అమెరికా–ఇరాన్ చర్చలు శాంతికి దారి తీస్తాయా లేక మరింత ఉద్రిక్తతకు నాంది అవుతాయా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది. కానీ ఈ దౌత్య క్రీడలో పాక్​ పాత్రపై  ప్రపంచదేశాల్లో అనుమానాలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి.

Latest News