ప్రముఖ ఇన్స్టంట్ మేసేజింగ్ కంపెనీ వాట్సాప్ యూజర్లకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకువస్తుంటుంది. తాజాగా మరో ఫీచర్ను పరిచయం చేయబోతున్నది. ఈ ఫీచర్తో లాగిన్ సమస్యలు తొలగిపోతున్నాయి. ప్రస్తుతం వాట్సాప్ లాగిన్ కావాలంటే ఫోన్ వెరిఫికేషన్ అవసరం. ఇందుకోసం ఆరు నంబర్లు గల ఓటీపీ మెసేజ్ ఫోన్కు వస్తుంది. ఫోన్ నంబర్ పని చేయకపోయినా.. ఆ సమయంలో నెట్వర్క్ సరిగా లేకపోయినా ఓటీపీ వచ్చేది కాదు. ఈ క్రమంలో ఫోన్ నంబర్ అవసరం లేకుండా ఈ-మెయిల్ వెరిఫికేషన్తోనే వాట్సాప్ లాగిన్ అయ్యే అవకాశం రాబోతున్నది.
ఈ-మెయిల్ వెరిఫికేషన్తో లాగిన్ అయ్యేలా ఫీచర్ను పరిచయం చేయనున్నది వాట్సాప్. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్నది. ఐఓఎస్, ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు అందుబాటులో ఉంది. టెస్టింగ్ దశ పూర్తయిన తర్వాత యూజర్లందరికీ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తున్నది. ఇకపై వాట్సాప్లో లాగిన్ అయ్యేందుకు యూజర్లు ఫోన్ నంబర్కు బదులుగా మెయిల్ ఐడీని ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మెయిల్కు వచ్చిన వెరిఫికేషన్ ఐడీని ఎంటర్ చేస్తే వాట్సాప్ లాగిన్ అవుతుంది.
అయితే, వెరిఫికేషన్ కోసం యూజర్లు ఇచ్చిన మెయిల్ ఐడీ ఎవరికీ కనిపించదు. ఇప్పటికే గుర్తు తెలియని వ్యక్తుల నుంచి కాల్స్ రాకుండా సైలెంట్ మోడల్ చేసుకునే సదుపాయాన్ని వాట్సాప్ తీసుకువచ్చింది. కొద్దిరోజుల కిందట ఆడియో, వీడియో కాల్స్ సమయంలో లొకేషన్ ఐపీ అడ్రస్ వివరాలను ఇతరులకు తెలియకుండా గోప్యంగా ఉంచే ఫీచర్ను పరిచయం చేసింది. వీటితో పాటు యూజర్ల సేఫ్టీ కోసం మరిన్ని ఫీచర్లను తీసుకువచ్చేందుకు వాట్సాప్ ప్రయత్నాలు చేస్తున్నది.