విధాత: మధ్యప్రదేశ్(Madhya Pradesh)జబల్‌పూర్(jabalpur) జిల్లాలోని సిహోరా తెహసిల్‌లోని మహాగవాన్ కోలారి(Mahagawan Kolari) ప్రాంతంలో ఇటీవల భారీ బంగారు నిక్షేపాలను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(Geological Survey of India) కనుగొన్న సంగతి తెలిసిందే. ఏకంగా 100 హెక్టార్ల లో లక్షల టన్నుల బంగారు(gold mines) నిల్వలున్నాయని గుర్తించింది. మహాగవాన్ కియోలారి(Mahagawan Kolari)అంతటా మట్టి నమూనాలను నిర్వహించి, రసాయన విశ్లేషణ ద్వారా బంగారం మాత్రమే కాకుండా, రాగి , ఇతర విలువైన లోహాలు కూడా ఉన్నాయని గుర్తించింది. ఇక్కడ బంగారం కోసం మైనింగ్ జరిగితే అది దేశానికే గేమ్ ఛేంజర్(game changer) అవుతుందని ఖనిజ నిపుణులు చెబుతున్నారు. బంగారు నిక్షేపాల గుర్తింపు కొన్నేళ్లుగా ఖనిజాన్వేషనలో భారత్ సాధించిన కీలక పురోగతిగా అభివర్ణించారు. దేశ ఆర్థిక వ్యవస్థలో మైలురాయిగా పేర్కొన్నారు. మరోవైపు బంగారం నిక్షేపాల వెలికితీత దిశగా మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ ప్రారంభించిన మైనింగ్ కాన్ క్లేవ్ లో కీలక ప్రకటన చేశారు. ఆత్మనిర్భర భారత్ లో భాగంగా మధ్యప్రదేశ్ ఖనిజ వనరుల ఎగుమతులలో కీలకంగా మారనుందని..ఇందులో జబల్ పూర్ మహాగవాన్ కోలారి కీలకం కానుందన్నారు. జబల్పూర్ జిల్లాలో ఇప్పటికే 42 గనుల నుంచి ఇనుము, మాంగనీస్, లాటరైట్, సున్నపురాయి , సిలిసియా ఇసుకను వెలికితీస్తున్నారని.. ఇనుప ఖనిజంలో ఎక్కువ భాగం చైనా వంటి దేశాలకు ఎగుమతి అవుతుందని గుర్తు చేశారు.

దేశంలో ఏడు బంగారు గనులు..

బంగారం గనులు భారత్ ఏడు ప్రాంతాల్లో మాత్రమే ఉన్నట్లు భూగర్భ శాస్త్రవేత్తలు గుర్తించారు. వాటిలో ప్రధానంగా కర్ణాటక రాయచూర్ జిల్లాలోని హుట్టి గని భారతదేశంలో ప్రాచీనమైనది. ఇది సంవత్సరానికి సుమారు 1.8 టన్నుల బంగారాన్ని ఉత్పత్తి చేస్తోంది. దాదాపు 2,000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ గనికి అంతర్జాతీయ గుర్తింపు కూడా ఉంది. రెండవది కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్). 1880లో బ్రిటిష్ ప్రభుత్వం ప్రారంభించిన ఈ గని ఒకప్పుడు ప్రపంచంలో రెండవ అత్యంత లోతైన గనిగా నిలిచింది. ఇది దాని జీవితకాలంలో సుమారు 800 టన్నుల బంగారాన్ని ఉత్పత్తి చేసింది. ఇది 2001లో మూసివేయబడింది. అయితే 2025లో తిరిగి ప్రారంభించడానికి ప్రణాళికలు కసరత్తు చేస్తున్నారు. మూడవది ఉత్తరప్రదేశ్ లోని సోన్‌భద్ర గనులు. 2020లో భూగర్భ శాస్త్రవేత్తలు కొత్తగా గుర్తించిన సోన్‌భద్ర గనులు బంగారం తవ్వకానికి కొత్త అధ్యాయాన్ని తెరిచాయి. ఇవి రాబోయే కాలంలో ఉత్తరభారత బంగారు పరిశ్రమకు మార్గదర్శకమవుతాయని నిపుణుల అంచనా వేస్తున్నారు.

నాల్గవది ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలోని రామగిరి బంగారు క్షేత్రం. ఈ ప్రదేశం విజయనగర సామ్రాజ్య కాలం నుండి బంగారు నిల్వలకు ప్రసిద్ధి చెందింది. ఇది పరిశోధనకు, తవ్వకాలకు కేంద్రంగా మారుతోంది. ఐదవది జార్ఖండ్ లోని పరాసి బంగారు గని. తూర్పు సింగ్‌భూమ్ జిల్లాలోని పరాసి గని రాగి, బంగారు నిల్వల కలయికకు ప్రసిద్ధి. ఆరవది కర్ణాటక లోని గడగ్ బంగారు గని. ఏడవది ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలోని చిగర్గుంట-బిసనతం గని. ఈ గనిపై పరిశోధనలు సాగుతున్నాయి. భవిష్యత్‌లో ఇది ఒక ప్రముఖ బంగారు కేంద్రంగా ఎదిగే అవకాశముంది.