న్యూఢిల్లీ : రైల్వే ప్రయాణికులకు భారతీయ రైల్వే షాక్ కొత్త సంవత్సరం ముంగిట షాక్ ఇచ్చింది. టికెట్ ధరల(Indian Railways Fare Hike)ను పెంచుతున్నట్లుగా భారతీయ రైల్వేశాఖ ప్రకటన చేసింది. పెంచిన టికెట్ చార్జీలు డిసెంబరు 26 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. పెరుగుతున్న నిర్వహణ ఖర్చులను సర్దుబాటు చేసుకునేందుకు.. మరింత మంది ప్రయాణికులకు రైల్వే సేవలను చేరువ చేయాలనే లక్ష్యంతో టికెట్ ధరలు పెంచినట్లుగా రైల్వే శాఖ అధికారులు తెలిపారు. పెంచిన చార్జీలతో దాదాపు రూ.600 కోట్ల మేర అదనపు ఆదాయం సమకూరుతుందని రైల్వేశాఖ అంచనా వేస్తోంది.
పెంచిన చార్జీల మేరకు లోకల్, స్వల్ప దూర ప్రయాణాల టికెట్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. అలాగే ఆర్డినరీ క్లాస్లో 215 కి.మీల కంటే తక్కువ దూరం ప్రయాణికులకు ఎలాంటి ఛార్జీలు పెంచలేదు. అంతకంటే ఎక్కువ దూరం వెళ్లే.. ఆర్డినరీ క్లాస్ రైలు టికెట్ ధర కిలోమీటరకు 1 పైసా చొప్పన పెంచింది. మెయిల్/ఎక్స్ప్రెస్ ఏసీ, నాన్-ఏసీ రైళ్లలో కిలోమీటరకు 2 పైసలు చొప్పున ఛార్జీలు పెంచింది. ఇక నాన్-ఏసీ ట్రైన్లో 500 కి.మీ దూరం ప్రయాణించే వారు అదనంగా రూ.10 మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. ఈ నెల 26 నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి.
