విధాత : అమెరికా యుద్ధ నౌక హార్ముజ్ జల సంధిని దాటేందుకు ప్రయత్నిస్తే.. 30 నిమిషాల్లోనే పేల్చేస్తామని ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ హెచ్చరికల దెబ్బకు హర్మూజ్ దాటాలని ప్రయత్నించిన అమెరికా యుద్ద నౌక వెనక్కి తగ్గింది. పాకిస్తాన్ లో ఇరు దేశాల మధ్య శాంతి చర్చలలో ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో అమెరికాకు ఇరాన్ ఈ వార్నింగ్ ఇవ్వడం గమనార్హం.
మరోవైపు ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్, అమెరికా మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలమైన నేపథ్యంలో ఇరాన్ హర్మూజ్పై పట్టు మరింత బిగించే అవకాశం ఉంది. దీంతో గల్ఫ్ జలాల్లో వేచి ఉన్న నౌకల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఇరాన్ ఆ నౌకలకు అనుమతినివ్వకపోతే మునుముందు ప్రపంచ దేశాలకు మరోసారి చమురు కొరత తప్పదన్న ఆందోళన వ్యక్తమవుతుంది.
చర్చలు విఫలం..ట్రంప్ ఏం చేస్తారో ?
ఇస్లామాబాద్లో చర్చల అనంతరం అమెరికా అధ్యక్షుడు జేడీ వాన్స్ మీడియాతో మాట్లాడుతూ చర్చలు విఫలమైనట్లుగా ప్రకటించారు. 21 గంటలు నిరంతాయంగా ఇరాన్ తో తాము చర్చలు జరిపినప్పటికి..కీలక అంశాల్లో సైతం ఎలాంటి ఒప్పందానికి రాలేకపోయామని స్పష్టం చేశారు. ఒప్పందానికి అనుకూలంగా తాము షరతలు విధించామని.. కానీ వాటిని ఇరాన్ ప్రతినిధులు అంగీకరించలేదని వాన్స్ పేర్కొన్నారు. చర్చల్లో తాము చాలా సానుకూలంగా వ్యవహరించామన్నారు. సద్భావనతో ఇక్కడికి వచ్చి.. ఒక ఒప్పందం చేసుకునేందుకు తమ వంతు ప్రయత్నం చేశామన్నారు. కానీ, దురదృష్టవశాత్తు ఎలాంటి పురోగతి సాధించలేకపోయామన్నారు. ఇది అమెరికా కంటే.. ఇరాన్కే దురదృష్టకర వార్తగా పేర్కొన్నారు. ఎలాంటి ఒప్పందం కుదరకుండానే తాము.. అమెరికాకు తిరిగి వెళ్లిపోతున్నట్లు తెలిపారు.
హర్మూజ్ జలసంధి, ఇరాన్ అణు హక్కులు వంటి కీలక అంశాలపై ప్రతిష్ఠంభన కారణంగానే తమ మధ్య చర్చలు విఫలమయ్యాయని ఇరాన్ దేశ మీడియా పేర్కొంది. యుద్ధంతో సాధించలేని వాటిని అమెరికా చర్చల్లో ప్రతిపాదించిందని ఘనాలోని ఇరాన్ రాయబార కార్యాలయం పేర్కొంది. తాము వాటన్నింటినీ గట్టిగా తిరస్కరించినట్లు తెలిపింది. హర్మూజ్ జలసంధి మూసే ఉంటుందని స్పష్టం చేసింది.
నౌక దళ దిగ్బంధానికి అమెరికా ఆలోచన
ఇరాన్తో చర్చలు విఫలమవడంతో అమెరికా ఎటువంటి చర్యలు తీసుకుంటుందోనని ప్రపంచ దేశాల్లో ఆందోళన నెలకొంది. తమ డిమాండ్లను అంగీకరించకపోతే ఇరాన్ నౌకలను దిగ్బంధించే అవకాశం ఉన్నట్లు చెబుతున్న ఓ మీడియా కథనాన్ని ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఇరాన్పై తదుపరి ప్రణాళికల గురించి ట్రంప్ పరోక్షంగా హింట్ ఇచ్చారా అని అంతర్జాతీయ మీడియా అనుమానం వ్యక్తం చేస్తుంది.
