Medaram | దేవుళ్ల వద్ద రాజకీయం మంచిదికాదు..మంత్రులు పొంగులేటి, సీతక్క, సురేఖ, అడ్లూరి

మేడారం సమ్మక్క సారలమ్మ దేవాలయం అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్ 20 లోగా పూర్తి చేయాలని రాష్ట్ర మంత్రులు పొంగులేటి, సీతక్క, సురేఖ, అడ్లూరి ఆదేశించారు.

విధాత, ప్రత్యేక ప్రతినిధి :

మేడారం సమ్మక్క సారలమ్మ దేవాలయం అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్ 20 లోగా పూర్తి చేయాలని రాష్ట్ర మంత్రులు పొంగులేటి, సీతక్క, సురేఖ, అడ్లూరి ఆదేశించారు. బుధవారం ములుగు జిల్లా ఎస్ తాడ్వాయి మండలం మేడారంలో రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు పోరిక బలరాం నాయక్, చీఫ్ మినిస్టర్ ప్రిన్సిపల్ సెక్రెటరీ కేఎస్ శ్రీనివాసరాజు పర్యటించారు.

ఈ సందర్భంగా జరిగిన సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రులు మాట్లాడారు. మేడారంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై, ప్రాకారం లోపల సివిల్ పనులు, గద్దెల ఎత్తు పెంచడం, నిర్మాణం , ప్రధాన ద్వారాలు, ఆర్చ్, 4 వాచ్ టవర్లు, ప్రాకారానికి చుట్టూ సీసీ రోడ్డు పనులను సమాంతరంగా చేపట్టి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దీనికి తోడుగా గ్రీనరీ, ప్లాంటేషన్ చేయాలన్నారు. కావాల్సిన గ్రానైట్ వేగవంతంగా తెప్పించుకోవాలన్నారు.

మేడారం లో రోడ్డు నిర్మాణ పనులు.. డివైడర్లు, ప్లాంటేషన్‌తో సహా నెల రోజుల్లో పూర్తి కావాలన్నారు. మాస్టర్ ప్లాన్ లో భాగంగా మొదటి విడతలో క్యూ లైన్ షేడ్స్, 4 రోడ్డు లైన్ల విస్తరణ, టెంపర్ అభివృద్ధి, గద్దెల వద్ద భక్తుల కెపాసిటీ 3 వేల నుండి 10 వేలకు పెంచనున్నట్లు తెలిపారు. 19 ఎకరాలు భూ సేకరణ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి కోరిన విధంగా జంపన్నవాగు పై చెక్ డ్యామ్‌ల ఏర్పాటుకు ఇరిగేషన్ అధికారులు తక్షణమే ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. శాశ్వత బస్‌స్టేషన్, జంపన్నవాగు అభివృద్ధి, సుందరికరణ ప్రతిపాదనలు సిద్ధం చెయాలన్నారు.

4 అధునాతన పశు వదశాలల ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. మేడారం చుట్టుపక్కల రహదారులకు మరమ్మతులు, ప్రధాన రహదారిలో అడ్డంకులు ఉండకుండా మిగిలి ఉన్న పనులు, మల్లంపల్లి బ్రిడ్జి, కటాక్షపూర్ బ్రిడ్జి పై ప్రత్యేక శ్రద్ధ చూపి డిసెంబర్ 15 లోగా పూర్తి కావాలని నేషనల్ హై వే అధికారులను ఆదేశించారు. ఈ నెల 22 న మళ్ళీ వస్తామని, నిర్దేశిత పనులు పూర్తి కావాలని సూచించారు. నాణ్యతలో రాజీపడేది లేదని, తేడా వస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా మేడారంలో జరుగుతున్న అభివృద్ధి పనులను జాతరకు పక్షం రోజుల ముందుగానే అన్ని పనులను పూర్తి చేస్తామని, గిరిజన పూజార్ల సూచన మేరకే పునరుద్ధరణ పనులు చేపడుతున్నామని అన్నారు.

ముందస్తు మొక్కులు చెల్లించుకునే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పనులను పూర్తి చేస్తామని అన్నారు. వచ్చే రెండు వందల సంవత్సరాల కాలం పాటు శాశ్వతంగా నిలిచిపోయే విధంగా అభివృద్ధి చేస్తామన్నారు. భవిష్యత్ లో 10 కోట్ల మంది భక్తులకు సరిపోయే విధంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. మేడారం అభివృద్ధి, మాస్టర్ ప్లాన్ పై త్వరలో ముఖ్యమంత్రి సమీక్షిస్తారని అన్నారు. ఎంత ఖర్చు అయినా అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. గిరిజనుల సాంప్రదాయాలకు అనుగుణంగా అమ్మ వార్ల గద్దెల ప్రాంతాన్ని తీర్చిదిద్దుతామని, అన్ని పనులను పూర్తి చేసి రానున్న జాతరను విజయవంతం చేస్తామన్నారు.

చరిత్రలో నిలిచిపోయే విధంగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, రాష్ట్ర పండుగగా గుర్తించిన మేడారం జాతరను జాతీయ పండుగ గుర్తించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రులు కోరారు. చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దేవుళ్ల ప్రాంతాలలో గిరిజనుల సాంప్రదాయ పద్ధతి ప్రకారమే గద్దెల పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని, గిరిజనుల అస్తిత్వం, ఆత్మగౌరవానికి విలువలు ఇస్తూనే పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. మరో వారం రోజుల్లోగా గద్దెల ప్రాంతం ఒక రూపానికి వస్తుందని వివరించారు. భక్తులు విశ్వాసం నమ్మకంతో అమ్మవార్లను దర్శించుకోవడానికి వస్తున్నారని, వారి విశ్వాసం దెబ్బ తినకుండా ఆదివాసీల అస్తిత్వం కాపాడుకుంటూ పనులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్, సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ కేఎస్ శ్రీనివాసరాజు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్, దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్.హారీష్, జిల్లా కలెక్టర్ దివాకర టీ.ఎస్, ఎస్‌పీ శబరిష్, డీఎఫ్‌ఓ రాహుల్ కిషన్ జాదవ్, అదనపు కలెక్టర్లు (రెవెన్యూ) సీహెచ్ మహేందర్ జి, (స్థానిక సంస్థలు) సంపత్ రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, ఆర్ అండ్ బీ, పీఆర్‌ఈ‌ఎన్‌సీ, ఆర్డీఓ వెంకటేష్, ప్రజా ప్రతినిధులు, పూజారులు, జిల్లా అధికారులు, ఆర్కిటెక్చర్, గుత్తేదారులు, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.