అవినీతికి వ్యతిరేకమని..రూ.కోటి లంచం తీసుకున్న ట్రైనీ ఐపీఎస్ !

ఛత్తీస్‌గఢ్ క్యాడర్‌కు చెందిన 2022 ఐపీఎస్ ఆఫీసర్ రాహుల్ బన్సల్ ఫీల్డ్ ట్రైనింగ్‌లోనే ఒక సైబర్ ఫ్రాడ్ కేసులో రూ.కోటి లంచం తీసుకున్నట్లు ఢిల్లీ సీబీఐ కోర్టుకు ఫిర్యాదు అందడం సంచలనం రేపింది. రాహుల్ బన్సల్ గతంలో తన మాక్ ఇంటర్వ్యూలో " పంచాయతీ సెక్రటరీకి రూ.500 లంచం ఇవ్వడం నన్ను తీవ్రంగా బాధించింది" అని చెప్పిన పాత వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది..

Reported by: Y.V. Narsimha Reddy | Latest News | Aug 13, 2026, 11:17 am IST
Read Time: 4 mins
అవినీతికి వ్యతిరేకమని..రూ.కోటి లంచం తీసుకున్న ట్రైనీ ఐపీఎస్ !

న్యూఢిల్లీ : ఇటీవల ఐపీఎస్ ట్రైనీల అనైతిక ప్రవర్తనలు దేశంలో పెరిగిపోతున్నాయి. హైదరాబాద్ లో ఓ ట్రైనీ ఐపీఎస్ లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కోవడం పోలీసు శాఖను కలవరపరిచింది. ఇంకోవైపు ఛత్తీస్‌గఢ్ క్యాడర్‌కు చెందిన 2022 ఐపీఎస్ ఆఫీసర్ రాహుల్ బన్సల్ ఫీల్డ్ ట్రైనింగ్‌లోనే ఒక సైబర్ ఫ్రాడ్ కేసులో రూ.కోటి లంచం తీసుకున్నట్లు ఢిల్లీ సీబీఐ కోర్టుకు ఫిర్యాదు అందడం సంచలనం రేపింది.

ప్రస్తుతం అంబికాపూర్‌లో సిటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (CSP)గా తన మొదటి ఫీల్డ్ పోస్టింగ్‌లో ఉన్న రాహుల్ బన్సల్ తో పాటు అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ రాథోర్, కానిస్టేబుల్ అన్షుల్ శర్మలు ఒక సైబర్ మోసం కేసును కప్పిపుచ్చడానికి ₹ 1 కోటి లంచం డిమాండ్ చేసి, స్వీకరించినట్లు ఫిర్యాదు నమోదైంది. రూ. 1 కోటి లంచాన్ని ఒకేసారి కాకుండా, 2026 మే నెలలో రెండు విడతలుగా (రూ. 50 లక్షల చొప్పున) హవాలా మార్గాల ద్వారా తీసుకున్నట్లు ఫిర్యాదుదారు పేర్కొన్నారు. ఫిర్యాదుదారుడు వాట్సాప్ చాట్‌లు, కాల్ రికార్డింగ్‌లతో సహా డిజిటల్ సాక్ష్యాలను సమర్పించారు.సమర్పించిన డిజిటల్ సాక్ష్యాధారాలను పరిగణనలోకి తీసుకున్న ప్రత్యేక సీబీఐ కోర్టు.. ఛత్తీస్‌గఢ్ పోలీస్ డైరెక్టర్ జనరల్ (డీజీపీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) డైరెక్టర్ నుండి యాక్షన్ టేకెన్ రిపోర్ట్ (ఏటీఆర్)ను కోరింది.

రూ.కోటి లంచం తీసుకున్న అభియోగాలను ఎదుర్కొంటున్న ఐపీఎస్ రాహుల్ బన్సల్ గతంలో తన మాక్ ఇంటర్వ్యూలో ” పంచాయతీ సెక్రటరీకి రూ.500 లంచం ఇవ్వడం నన్ను తీవ్రంగా బాధించింది” అని చెప్పిన పాత వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.