- 70 వేలు అప్పగింత.. అత్యధికం గోవా నుంచే
- పంజాబ్ నుంచి 19.79 శాతం సరెండర్
- ఆర్టీఐ దరఖాస్తులో ఎంఈఏ డాటా వెల్లడి
- దశాబ్దకాలంలో భారత పౌరసత్వాన్ని
- వదులుకున్నవారి సంఖ్య 16.21 లక్షలు
- పాస్పోర్ట్ల సరెండర్ సంఖ్య 69,303
విధాత: గడిచిన పదేండ్లలో సుమారు 70 వేల మంది భారతీయులు తమ పాస్పోర్టు (Passports)లను తిరిగి ప్రభుత్వానికి అప్పగించారు. 2011-2022 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా మొత్తం 69,303 పాస్ పోర్ట్లను పాస్పోర్ట్లను ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయాల (RPO) వద్ద సరెండర్ చేశారు. 90 శాతానికి పైగా పాస్పోర్టులను ఎనిమిది రాష్ట్రాలు గోవా, పంజాబ్, గుజరాత్, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఢిల్లీ, చండీగఢ్ నుంచి అప్పగించారు. అత్యధికంగా గోవా నుంచే ఉన్నారు.
అత్యధికంగా గోవా నుంచి 28,031 (40.45 శాతం) పంజాబ్ (చండీగఢ్ యుటితో సహా) 9,557 (13.79 శాతం) పాస్పోర్ట్లను అమృత్సర్, చండీగఢ్లోని ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయాల్లో అప్పగించారు. పదేండ్లలో భారత పౌరసత్వాన్ని ఎంత మంది వదులుకున్నారు? వారిలో ఎంత మంది తమ పాస్పోర్టులను సరెండర్ చేశారని సమాచార హక్కు (RTI) కింద ది ఇండియన్ ఎక్స్ప్రెస్ దరఖాస్తు చేయగా, విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ (MEA) వివరాలను (డాటా)ను వెల్లడించింది.
2011 నుంచి ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయాల్లో 69,303 పాస్పోర్ట్లు సరెండర్ చేశారని ఎంఈఏ తెలిపింది. ఈ కాలంలో భారత పౌరసత్వాన్ని వదులుకున్న వారిలో కొందరు మాత్రమే పాస్పోర్టులను అప్పగించినట్టు పేర్కొన్నది. కాగా, 2011 నుంచి 2022 అక్టోబర్ 31 వరకు 16.21 లక్షల మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నట్టు విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి మురళీధరన్ ఈ ఏడాది మార్చి 24న పార్లమెంటులో లిఖితపూర్వకంగా వివరించారు.
భారత పౌరసత్వాన్ని త్యజించి ఇతర దేశాల పౌరసత్వం పొందే వారి సంఖ్య ఏటేటా పెరుగుతున్నది. విద్య, ఉద్యోగం, ఉపాధి అవకాశాల కోసం లక్షల మంది భారతీయులు విదేశాల్లో ఎక్కువగా స్థిరపడుతున్నారు. ఈ క్రమంలో చాలా మంది భారతీయులు ఆయా దేశాల పౌరసత్వాన్ని స్వీకరించేందుకు ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా అమెరికాలో స్థిరపడేందుకు అమిత ఆసక్తి చూపుతున్నారు. మన దేశంలో ద్వంద్వ పౌరసత్వ విధానం లేకపోవడంతో.. భారత పౌరసత్వాన్ని వదిలేసుకుంటున్నారు.