ఆంధ్రప్రదేశ్లోని వెంకటాయపాలెంలో దళిత యువకులను చిత్రహింసలు పెట్టి ఇద్దరికి శిరోముండనం చేసిన కేసులో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులతో పాటు తొమ్మిది మంది దోషులకు
వెంకటాయపాలెం శిరోముండనం కేసులో కోర్టు తీర్పు
దోషులకు బెయిల్ మంజూరీ చేసిన కోర్టు
విధాత: ఆంధ్రప్రదేశ్లోని వెంకటాయపాలెంలో దళిత యువకులను చిత్రహింసలు పెట్టి ఇద్దరికి శిరోముండనం చేసిన కేసులో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులతో పాటు తొమ్మిది మంది దోషులకు 18నెలల జైలుశిక్ష, మరో ఆరు నెలల జైలుశిక్ష, లక్ష 50వేల జరిమాన విధిస్తు విశాఖ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 1996డిసెంబర్ 29న వెంకటాయపాలెంలో పొలం చుట్టు ఫెన్సింగ్ ధ్వంసం, ఈవ్టీజింగ్ కేసులపై గ్రామపెద్దలు పంచాయతీ పెట్టారు.
ఈ సందర్భంగా ఐదుగురు దళిత యువకులను చిత్రహింసలు పెట్టి అందులో ఇద్దరికి శిరోముండనం చేసి కనుబొమ్మలు తొలగించారు. 1997జనవరి 1న ద్రాక్షరామ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసులో త్రిమూర్తులు నిందితులుగా ఉన్నారు. 28ఏండ్ల పాటు సాగిన కోర్టు విచారణ తీర్పు మంగళవారం వెలువడింది. మొత్తం 10మంది దోషులలో ఒకరు చనిపోగా మిగతా తొమ్మిదిమందికి ఎస్సీ, ఎస్టీ కోర్టు శిక్ష ఖరారు చేసి తీర్పు వెలువరించింది.
24మంది సాక్షుల్లో 11మంది చనిపోగా, కేసు సుదీర్ఘ విచారణలో ఆరుగురు పీపీలుగా పనిచేశారు. నిందితుల్లో ఆరుగురు ఎమ్మెల్సీ కుటుంబ సభ్యులుకాగా, ముగ్గురు వ్యక్తిగత సహాయకులుగా ఉన్నారు. తీర్పు వెలువడిన వెంటనే త్రిమూర్తులు సహా నిందితులంతా బెయిల్ కోసం కోర్టుకు దరఖాస్తు చేశారు. ఓక్కోరి పేరు మీద 42వేల పూచికత్తును న్యాయవాదులు సమర్పించారు. వారికి కోర్టు బెయిల్ నిరాకరించిన పక్షంలో అందరిని జైలుకు తరలించేందుకు పోలీసులు కోర్టు దగ్గర సిద్ధంగా ఉన్నారు. అయితే ఉత్కంఠతల మధ్య కోర్టు దోషులుగా ఉన్న తొమ్మిది మందికి బెయిల్ మంజూరు చేసింది.
ఎమ్మెల్సీ త్రిమూర్తులు 1994లో రామచంద్రపురం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలిచారు. 1999లో కాంగ్రెస్ నుంచి, 2004లో టీడీపీ నుంచి, 2009లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి ఓడారు. 2012ఉప ఎన్నికలో, 2014ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన త్రిమూర్తులు టీడీపీ నుంచి వైసీపీలో చేరి గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మండపేట నియోజవర్గం వైసీపీ అభ్యర్థిగా త్రిమూర్తులు పోటీ చేస్తున్నారు. తనకు వెంకటాయపాలెం ఘటనతో సంబంధం లేదంటూ త్రిమూర్తులు ఇన్నాళ్లుగా చేసిన వాదనను కోర్టు పరిగణలోకి తీసుకోలేదు.
తీర్పు అనంతరం ఆయనను అరెస్టు చేసిన పక్షంలో ఎన్నికల ప్రచారం ఏలా అన్నది ప్రశ్నార్ధంగా మారింది. అయితే కోర్టు త్రిమూర్తులతో పాటు దోషులందరికి బెయిల్ మంజూరు చేయడంతో ఆయన తిరిగి ఎన్నికల ప్రచారం కొనసాగించనున్నారు. కాగా విశాఖ ఎస్సీ, ఎస్టీ కోర్టు ఇచ్చిన తీర్పుతో ఇన్నాళ్లకైనా మాకు న్యాయం జరిగిందని బాధిత కుటుంబాలు హర్షం వ్యక్తం చేశాయి. కారంచేడు, చుండూరు సంఘటనల తర్వాతా వెంకటాయపాలెం కేసులో న్యాయం గెలిచిందని దళిత సంఘాలు కోర్టు తీర్పును స్వాగతించాయి.