Delhi | విధాత: ఉత్తర ఢిల్లీలో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వజీరాబాద్లోని ఢిల్లీ పోలీస్ ట్రైనింగ్ స్కూల్ ఆవరణలోని యార్డ్ ఉంచిన 450 వాహనాలు పూర్తిగా కాలిపోయాయి. వజీరాబాద్ పోలీసులు ఆయా వాహనాలను వివిధ కేసుల్లో సీజ్చేసి యార్డులో పెట్టగా, అగ్నిప్రమాదంలో అవి కాలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఎనిమిది ఫైర్ ఇంజిన్లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలు పెరగడం వల్ల సమీపంలోని అగ్నిమాపక కేంద్రాల నుంచి అదనపు అగ్నిమాపక టెండర్లను పిలిపించారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
అగ్నిప్రమాదంలో 450 వాహనాలు దగ్ధమయ్యాయి. వీటిలో 200 నాలుగు చక్రాల వాహనాలు, 250 ద్విచక్ర వాహనాలు ఉన్నట్టు ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ విభాగం తెలిపింది. “పోలీస్ శిక్షణా పాఠశాలలో సీజ్చేసిన కార్లు, బైకులు ఉంచే యార్డ్ ఏరియాలో మంటలు చెలరేగాయి. ఉదయం 4:15 గంటలకు అధికారులు మంటలను నియంత్రించారు ” అని అగ్నిమాపకశాఖ తెలిపింది. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అదృష్టవశాత్తూ, ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని పేర్కొన్నారు. ఎవరైనా సిగరేట్ పీక ఆర్పకుండా వేయడం వల్ల ప్రమాదం సంభవించిందా? లేదా ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.