రాష్ట్రానికి రూ.12,400 కోట్ల అదాని పెట్టుబ‌డులు

రాష్ట్రంలో రూ.12,400 కోట్ల‌తో నాలుగు రంగాలలో పెట్టుబ‌డులు పెట్ట‌డానికి అదాని గ్రూప్ ముందుకు వ‌చ్చింది

రాష్ట్రానికి రూ.12,400 కోట్ల అదాని పెట్టుబ‌డులు

– స్కిల్ సెంట‌ర్ యూనివ‌ర్సిటీ ఏర్పాటు

– దావోస్‌లో రేవంత్‌తో భేటీ అయిన అదాని

విధాత‌: రాష్ట్రంలో రూ.12,400 కోట్ల‌తో నాలుగు రంగాలలో పెట్టుబ‌డులు పెట్ట‌డానికి అదాని గ్రూప్ ముందుకు వ‌చ్చింది. ఈ మేర‌కు దావోస్‌లో ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి శ్రీ‌ధ‌ర్ బాబుతో క‌లిసి సీఎం రేవంత్ రెడ్డి అదాని గ్రూప్ చైర్మ‌న్ గౌత‌మ్ అదానితో భేటీ అయ్యారు. స్కిల్ సెంట‌ర్ యూనివ‌ర్సిటీని ఏర్పాటు చేయ‌డానికి ముందుకు వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా నాలుగు ఒప్పందాల‌పై సంత‌కాలు చేశారు. 135 మెగావాట్ల విద్యుత్ ఉత్ప‌త్తి చేసే రెండు పంప్డ్ స్టోరేజీల కోసం రూ.5000 కోట్ల‌తో అదాని గ్రీన్ ఎన‌ర్జీ పెట్టుబ‌డి, అలాగే చంద‌న్వెల్లిలో 100 మెగావాట్ల డేలా సెంట‌ర్ క్యాంప‌స్‌కు రూ.5000 కోట్ల‌తో అదాని క‌న్నెస్ డేటా సెంట‌ర్లు, రూ.1400 కోట్ల‌తో అంబుజా సిమెంట్స్ లిమిటెడ్‌కు చెందిన సిమెంట్ గ్రేడింగ్ యూనిట్‌, మ‌రో రూ.1000 కోట్ల‌తో అదాని ఏరో స్పేస్‌కు చెందిన డిఫెన్స్ కౌంట‌ర్ డ్రోన్ సిస్ట‌మ్‌, మిస్సైల్ డెవ‌ల‌ప్‌మెంట్ అండ్ మ్యాన్ ఫ్యాక్చ‌రింగ్ సెంట‌ర్ ఏర్పాటుకు గౌత‌మ్ అదాని తెలంగాణ ప్ర‌భుత్వంతో రేవంత్ స‌మక్షంలో ఎంఓయూల‌పై సంత‌కాలు చేశారు. అలాగే లిథియం గిగా ఫ్యాక్ట‌రీ కోసం గాడి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 12.5 జీడ‌బ్ల్యు హెచ్ కోసం రూ.8 వేల కోట్ల పెట్టుబ‌డులు పెట్ట‌డానికి ముందుకు వ‌చ్చింది. దీని ద్వారా రాబోయే 5 ఏళ్ల‌లో ఆరువేల ఉద్యోగాలు క‌ల్పిస్తామ‌ని కంపెనీ సీఈఓ మ‌హేశ్ గాడి తెలిపారు. ఇదే తీరుగా జేఎస్‌డ‌బ్ల్యు నియో ఎన‌ర్జీ రాష్ట్రంలో రూ.9000 కోట్ల‌తో 1500 మెగావాట్ల విద్యుత్ ఉత్ప‌త్తి సామ‌ర్థ్యం క‌లిగిన‌ స్టోరేజీతో పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్ ను నెల‌కొల్ప‌డానికి ఒప్పందం చేసుకుంది.

త్వరలో స్కిల్ యూనివర్సిటీ

ప్రజా పాలనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అత్యంత ప్రాధాన్యాల్లో ఒకటిగా ఎంచుకున్న స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుపై గౌతమ్ అదానీతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు. దీంతో యువతీ యువకుల నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయని.. పోటీ ప్రపంచంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయని సీఎం అన్నారు. తెలంగాణలో తమ పెట్టుబడులతో పాటు స్కిల్ యూనివర్సిటీల ఏర్పాటుకు అదానీ తన సంసిద్ధతను వ్యక్తపరిచారు. త్వరలోనే ఇంటిగ్రేటేడ్ స్టేట్ ఆప్ ది ఆర్ట్ స్కిల్లింగ్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని అన్నారు. పూర్తి వివరాలను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. అదానీ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి స్వాగతించారు. ఇఫ్పటికే తెలంగాణలో అనేక సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయని, ప్రపంచంలోని వ్యాపార దిగ్గజ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులకు ముందుకు రావటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పెట్టుబడులకు తెలంగాణ మొట్టమొదటి గమ్యస్థానంగా మారిందని అన్నారు. అదానీ గ్రూప్ తెలంగాణను తమ పెట్టుబడులకు ఎంచుకోవటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, సహాయ సహకారాలను తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదానీకి హామీ ఇచ్చారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం పెట్టుబడిదారులకు స్నేహపూర్వక వాతావరణం కల్పించిందని అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదాని అన్నారు. కొత్త పారిశ్రామిక విధానం మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేలా ఉందని, తమకందించిన ప్రోత్సాహంతో తెలంగాణలో అదానీ గ్రూప్ మరింత వేగంగా వృద్ధి చెందుతుందని అన్నారు. ఈ సమావేశంలో సీఎంతో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ స్పెషల్ సెక్రెటరీ విష్ణు వర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.