సిక్కింలో చిక్కుకున్న 800 మందిని రక్షించిన సైన్యం
జోరుగా మంచు కురుస్తుండటం, ప్రతికూల వాతావరణం కారణంగా తూర్పు సిక్కింలోని వివిధ ప్రాంతాల్లో 800 మందికి పైగా పర్యాటకులు చిక్కుకుపోయారు

- హిమపాతం, ప్రతికూల వాతావరణం
- కారణంగా చిక్కుకుపోయిన పర్యాటకులు
- పర్యాటకుల్లో వృద్ధులు, మహిళలు, పిల్లలు
విధాత: జోరుగా మంచు కురుస్తుండటం, ప్రతికూల వాతావరణం కారణంగా తూర్పు సిక్కింలోని వివిధ ప్రాంతాల్లో 800 మందికి పైగా పర్యాటకులు చిక్కుకుపోయారు. పర్యాటక ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారిలో వృద్ధులు, మహిళలు, పిల్లలు ఉన్నారు. ఇలా చిక్కుకుపోయిన పర్యాటకులను భారత సైన్యం బుధవారం రక్షించిందని అధికారులు తెలిపారు.
భారత సైన్యానికి చెందిన త్రిశక్తి కార్ప్స్ రెస్క్యూ మిషన్ బుధవారం సాయంత్రం వరకు కొనసాగింది. చిక్కుకుపోయిన పర్యాటకులందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించి ఆశ్రయం కల్పించారు. వెచ్చని దుస్తులు, వైద్య సహాయం, వేడి భోజనంతోపాటు ఇతర వసతులు కల్పించినట్టు అధికారులు తెలిపారు. ఒంటరిగా ఉన్నపర్యాటకులకు వసతి కల్పించేందుకు సైనికులు తమ బ్యారక్లను కూడా ఖాళీ చేశారని వెల్లడించారు.