- సీసీ కెమెరా దృశ్యాలతో పోటోల విడుదల
- ఎన్ఐఏ ప్రకటన
విధాత: రామేశ్వరం కేఫ్ బాంబు దాడి కేసులో నిందితుడిపై ఎన్ఐఏ భారీ రివార్డు ప్రకటించింది. నిందితుడి ఫొటోను విడుదల చేసిన ఎన్ఐఏ అధికారులు.. అతడి ఆచూకీ చెప్పిన వారికి రూ.10 లక్షల నగదు రివార్డును ప్రకటించారు. ఈ మేరకు జాతీయ దర్యాప్తు సంస్థ అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేసింది. సమాచారం చెప్పిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపింది. ఈ కింది పేర్కొన్న 080- 29510900, 8904241100 ఫోన్ నంబర్లకు సమాచారం చెప్పాలని కోరింది. మార్చి 1న బెంగళూరులోని రామేశ్వరం కేఫ్లో జరిగిన బాంబు పేలుడు ఘటన కేసును జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకు అప్పగిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది.
నిందితుడు ఏ మార్గంలో కేఫ్లోకి వచ్చాడు? బాంబు అమర్చిన తర్వాత ఎలా వెళ్లాడు? అనే అంశంపై సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. రవ్వ ఇండ్లి ఆర్డర్ చేసి తిని తన చేతిలోన పేలుడు పదార్దాలున్న సంచిని కేఫ్లో వదిలి వెళ్లిన నిందితుడి సీసీ కెమెరా ఫోటోలను విడుదల చేశారు. ఈ కేసులో నిందితుడు ఆర్టీఎక్స్ ఉపయోగించాడని నిపుణులు గుర్తించారు. ఇప్పటికే ఈ కేసులో పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నిందితుడి ఫోటోల కోసం ఐదు కిలోమీటర్ల పరిధిలోని 300 సీసీ కెమెరాల చిత్రాలను విశ్లేషించారు. తెల్లటోపీ ధరించిన వ్యక్తి నోటికి మాస్కు కట్టుకుని నల్లబూట్లు, అదే రంగు ప్యాంటు ధరించి ఉన్నట్లు గుర్తించారు. టైమర్ బాంబు సంచి కేఫ్లో పెట్టినప్పుడు చేతికి గ్లవ్స్ ధరించి ఉన్నట్లుగా గుర్తించారు.