BC political plenary | రాజ్యాధికార సాధన లక్ష్యంగా సాగాలి: బీసీ రాజకీయ ప్లీనరీలో నేతల గర్జన

BC political plenary జనాభా థామాషా మేరకు టికెట్లు ఇవ్వాలి చట్టసభలలో ప్రాతినిధ్యం కోసం పోరాడాలి ఆగస్టులో 5లక్షల మందితో బీసీల సింహగర్జన విధాత: రాజ్యాధికార సాధన లక్ష్యంగా బీసీలు బహుముఖ వ్యూహాలతో ముందుకు సాగాలని బీసీ రాజకీయ ప్లీనరీ నిర్ణయించింది. తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బిసీల రాజకీయ సాధికారతను సాధించడమే ఏకైక లక్ష్యంగా ఎల్బీనగర్ మన్సూరాబాద్ లోని కెబిఆర్ కన్వెన్షన్ లో శనివారం బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీల రాజకీయ ప్లీనరీని నిర్వహించారు. […]

BC political plenary | రాజ్యాధికార సాధన లక్ష్యంగా సాగాలి: బీసీ రాజకీయ ప్లీనరీలో నేతల గర్జన

BC political plenary

  • జనాభా థామాషా మేరకు టికెట్లు ఇవ్వాలి
  • చట్టసభలలో ప్రాతినిధ్యం కోసం పోరాడాలి
  • ఆగస్టులో 5లక్షల మందితో బీసీల సింహగర్జన

విధాత: రాజ్యాధికార సాధన లక్ష్యంగా బీసీలు బహుముఖ వ్యూహాలతో ముందుకు సాగాలని బీసీ రాజకీయ ప్లీనరీ నిర్ణయించింది. తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బిసీల రాజకీయ సాధికారతను సాధించడమే ఏకైక లక్ష్యంగా ఎల్బీనగర్ మన్సూరాబాద్ లోని కెబిఆర్ కన్వెన్షన్ లో శనివారం బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీల రాజకీయ ప్లీనరీని నిర్వహించారు. బహుజన పితామహుడు మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం ప్లీనరీ ఫ్రారంభమైంది.

బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షత జరిగిన ఈ ప్లీనరీలో ముఖ్య అతిధిగా జస్టిస్ ఈశ్వరయ్య, మాజీ ఎంపీ బీజేపీ రాష్ట్ర నాయకులు బూర నర్సయ్యగౌడ్, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి చొల్లేటి ప్రభాకర్, ఎంబిసి కార్పొరేషన్ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, బిసి కమిషన్ సభ్యులు ఉపేందర్, విద్య,వైద్య మౌలిక సదుపాయాల కమిటి మాజీ చైర్మన్ నాగేందర్ లు, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ విశారదన్ మహారాజ్, కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్, కత్తి వెంకటస్వామిలు హాజరై ఫ్రసంగించారు.

జాతీయ బిసి కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ బీసీలు తమ అస్థిత్వాన్ని కాపాడుకుంటూ నీతి ,నిజాయితీ, నిబద్ధతతో సంఘటితంగా పోరాడితే రాజ్యాధికారం సాధించవచ్చన్నారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు, చట్టసభలలో ఫ్రాతినిధ్యం కల్పించాల్సిన బాధ్యత పాలకులపై ఉందన్నారు. రాజకీయంగా సామాజిక న్యాయం పాటించని పార్టీలు కాలగర్భంలో కలిసిపోతాయని, పదేళ్లుగా దేశంలో కాంగ్రెస్ పరిస్థితి అలానే ఉందని, ఇటీవల కర్ణాటక ఎన్నికల్లో తీసుకున్న నిర్ణయాలతో ఆపార్టీ మళ్లీ కోలుకుంటుందని చెప్పారు.

ఆరెస్సెస్ విధానాలతో బీజేపీ ముందుకెల్తూ కులం ,మతం పేరుతో రాజకీయాలు చేస్తుందని, అది ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదమని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ దేశంలో కులవ్యవస్థ నిర్మూలన జరగాలని, సామాజిక న్యాయం కోసం ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. బీసీ రాజకీయ ప్లీనరీ ద్వారా దిశా నిర్దేశం చేసుకొని రాజ్యాధికారం దక్కించుకునేందుకు ఐక్యంగా ముందుకు సాగాలని జస్టీస్ ఈశ్వరయ్య సూచించారు
.
జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ జనాభాలో60 శాతానికి పైగా ఉన్న బీసీలకు తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకెళ్తామని స్పష్టం చేశారు. “ఓటు మనదే..సీటు మనదే మెమెంతో మాకంత’ ‘అనే నినాదంతో ఈ ప్లీనరీని నిర్వహిస్తున్నామని, రాజకీయ అధికారం కోసం రాజీలేని పోరాటం నిర్వహిస్తామని చెప్పారు. వచ్చే ఆగస్టు 3వ వారంలో 5 లక్షల మందితో హైదరాబాద్ లో సింహ గర్జన సభను నిర్వహిస్తామని జాజుల ప్రకటించారు.

పదవులకు అమ్ముడుపోయే జాతి బీసీలది కాదని, సర్దార్ సర్వాయి పాపన్న స్పూర్తితో అధికారమే అంతిమ లక్ష్యంగా ముందుకెల్దామని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 60 మంది బీసీలను ఎమ్మెల్యేలు చూడాలని ఉందని, ఇందుకు బిసి సంక్షేమ సంఘం రాజకీయాలను శాసించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తుందని, 60వ ఎమ్మెల్యేగా తాను అసెంబ్లీలో అడుగుపెడుతానని శ్రీనివాస్ గౌడ్ తన మనసులోని మాటను బయటపెట్టారు.

మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ.రాష్ట్ర జనాభాలో 60 శాతం ఉన్న బీసీలకు రాజకీయంగా తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. ఓటు ఒక ఆయుధమని ఓటును అమ్ముకుంటే బానిసలుగా మిగిలిపోతారని, ఆత్మగౌరవాన్నికాపాడుకుంటే రాజ్యాధికారం మన సొంతమవుతుందన్నారు. తాడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ రాజకీయ సాధికారతను సాధించడానికి ఇంత పెద్ద సంఖ్యలో బీసీలను ఐక్యం చేసి ప్లీనరీని నిర్వహించిన శ్రీనివాస్ గౌడ్ కు, సంఘానికి తాను అండగా ఉంటానని చెప్పారు.

డాక్టర్ విశారదన్ మహారాజ్ మాట్లాడుతూ రాజకీయాలలో దాడులకు ప్రతి దాడులు నిర్వహించినప్పుడే రాజ్యాధికారం మన సొంతమవుతుందన్నారు. జనాభాలో 90 శాతం ఉన్న బిసి, ఎస్సీ, ఎస్టీ,మైనార్టీలు స్వాతంత్రోద్యమంలో, తెలంగాణ తొలిదశ, మలిదశ ఉద్యమoలో కీలక పాత్ర పోషించారన్నారు. కరుణానిధి, స్టాలిన్, అఖిలేష్ యాదవ్, తేజస్వియాదవ్ ఇంకా అనేకమంది దేశంలో ఆత్మగౌరవానికి నిదర్శనమని విశారదన్ చెప్పారు.

ఈ దేశంలో జంతువులకు లెక్కలు ఉన్నాయి…కానీ బీసీల లెక్కలు తేల్చకుండా కేంద్ర ప్రభుత్వo సిగ్గులేకుండా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

డాక్టర్ చెరుకు సుధాకర్ మాట్లాడుతూ బిసిలకు రాజ్యాధికారం కోసం సత్తా చాటేందుకు ఇదే మంచి సమయమన్నారు .ఢిల్లీ స్థాయిలో ఉద్యమాన్ని ఉదృతంగా తీసికెళ్లినప్పుడే అన్ని రాజకీయ పార్టీలు దిగివస్తాయన్నారు. మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఐక్యంగా ముందుకు సాగితే రాజ్యాధికారం మన సొంతమవుతుందని, తద్వారా ఈ వర్గాల జీవితాల్లో వెలుగులు నింపవచ్చని అన్నారు.

రాజ్యాధికారం ఏకైక లక్ష్యంగా ఈ ప్లీనరీని నిర్వహించడం అభినందనీయమన్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత ఏర్పడిన ప్రభుత్వంలో ఒక్క మహిళకు మంత్రి పదవి ఇవ్వకుండా కేసీఆర్ ప్రభుత్వం వివక్ష చూపిందని అన్నారు. రాజ్యాధికారంలో మహిళలకు కూడా వాటా ఉండాల్సిందేనని మందకృష్ణ చెబుతూ ఈ ప్లీనరీలో తీర్మానం చేయాలని సూచించారు. నూతన సోషలిస్టు వ్యవస్థను నిర్మించడం కోసం అందరం ఐక్యంగా ముందుకెల్దామని పిలుపునిచ్చారు.

ఈ ప్లీనరీలో బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భైరి రవికృష్ణ, బిసి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు సురిగి దుర్గయ్యగౌడ్, బిసి కుల సంఘాల జేఏసీ చైర్మైన్ కుందారం గణేష్ చారి, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్, బిసి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కనకాల శ్యామ్ కురుమ, వడ్డే జానయ్య, బిసిల సైన్యం రాష్ట్ర అధ్యక్షుడు సింగం నగేష్, వజీర్ ప్రకాష్ గౌడ్, ముద్దగౌని రామ్మోహన్ గౌడ్, పిల్లి రామరాజు యాదవ్, నాయకులు గురిజ నర్సింహ, నర్సింహ నాయక్, పాలకూరి కిరణ్, అన్ని జిల్లాల అధ్యక్షులు, కమిటీల ప్రతినిధులు, మహిళా సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు