Supreme Court | న్యూఢిల్లీ : సోషల్ మీడియా యూజర్లు.. దాని ప్రభావం, చేసిన పోస్టులు ప్రజల్లోకి ఎంతగా వెళతాయనే విషయంలో జాగరూకతతో ఉండాలని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. 2018లో ఫేస్బుక్లో తమిళనాడు ఎమ్మెల్యే ఎస్ వేశేఖర్ (S Ve Shekher) మహిళా జర్నలిస్టులను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలను షేర్ చేశారు. ఈ విషయంలో ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. వాటిని కొట్టేయాలని ఆయన హైకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోవడంతో సుప్రీంకోర్టుకు వచ్చారు.
కానీ.. సుప్రీంకోర్టులోనూ ఆయనకు ఊరట లభించలేదు. సోషల్ మీడియాను ఉపయోగించే విషయంలో అత్యంత అప్రమత్తతో వ్యవహరించాలని జస్టస్ బీఆర్ గవాయి (B R Gavai), జస్టిస్ పీకే మిశ్రాల (Prashant Kumar Mishra) తో కూడిన ధర్మాసనం సూచించింది. ఎమ్మెల్యే తరఫున వాదనలు వినిపించిన అడ్వొకేట్.. తన క్లైంట్ ఆ రోజు కంటిలో మందు చుక్కలు వేసుకున్నారని, దాని వల్ల.. ఆ పోస్టు చూడకుండానే షేర్ చేశారని కోర్టుకు తెలిపారు. దీనిని పట్టించుకోని ధర్మాసనం.. ఎవరైనా సామాజిక మాధ్యమాలను ఉపయోగించే సమయంలో ఎలాంటి పర్యవసానాలు ఎదుర్కొనేందుకైనా సిద్ధంగా ఉండాలని పేర్కొన్నది.