విధాత: తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అంతర్గత కలహాలతో కూలబోతుందని, త్వరలోనే తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో చిట్ చాట్ లో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో త్వరలోనే రామరాజ్యం ఏర్పడబోతుందన్నారు. కాంగ్రెస్లో సీఎం రేవంత్రెడ్డి అభద్రతాభావంతో ఉన్నారనడానికి తరుచు తన ఫ్రభుత్వ మనుగడపై చేస్తున్న వ్యాఖ్యలే నిదర్శమన్నారు. రేవంత్రెడ్డి కాంగ్రెస్కు దూరమవ్వాలనుకుంటే ఆ ప్రభుత్వం కూలిపోతుందన్నారు.
కాంగ్రెస్లో కొనసాగడం కంటే.. 30 మంది బీఆరెస్ ఎమ్మెల్యేలతో సొంత దుకాణం పెట్టుకోవాలని రేవంత్ రెడ్డి చూస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్రెడ్డిని ఆ పార్టీ నేతలే వెన్నుపోటు పొడుస్తున్నారని, ఇప్పటికే ఎవరి దుకాణం వారు పెట్టుకున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్లో నెంబర్ 2 స్థానం కోసం పోటీ నడుస్తోందని, రెండో స్థానం కోసం ఐదుగురు ప్రయత్నిస్తున్నారన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెనుక కుట్ర జరుగుతోందన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగానే తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామే తప్ప కుట్రలు చేసే ఆలోచన తమకు లేదన్నారు.