విధాత: దక్షిణాది రాష్ట్రాలలో తమ ఏకైన అధికార కేంద్రం కర్ణాటక (Karnataka Elections)ను ఎలాగైనా నిలబెట్టుకోవడానికి బీజేపీ అధిష్ఠాన పెద్దలు కఠిన నిర్ణయాలకు సిద్ధమైంది. అక్కడి బీజేపీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు.. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు.. ప్రధానప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ నుంచి గట్టిపోటీ నేపథ్యంలో సీనియర్లను పక్కనపెట్టి కొత్తవారికి అవకాశం కల్పిస్తున్నది.
మొదటి జాబితాలపై బీజేపీలో చిచ్చు రాజేసింది. అసంతృప్తిని తగ్గించుకోవడానికి ప్రక్షాళన పేరుతో 52 మంది కొత్త అభ్యర్థులకు అవకాశం కల్పించి 15 మంది సీనియర్లకు టికెట్ నిరాకరించింది. మొదటి జాబితా 189పై పార్టీలో అసంతృప్త జ్వాలలు చెలరేగుతున్న సమయంలోనే రెండో జాబితాను వెల్లడించింది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ రెండో జాబితా ప్రకటించింది. 23 మంది అభ్యర్థులతో రెండో జాబితా విడుదల చేసింది. మొత్తం 224 సీట్లకు గాను రెండు విడతల్లో 212 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా 12 సీట్లకు ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉన్నది