BJP
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ ప్రజలకు భరోసా కల్పించే విధంగా ప్రధానమంత్రి మోడీ పర్యటన సాగిందని బిజెపి ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. హనుమకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో శనివారం జరిగిన విజయ్ సంకల్ప సభలో ఈటల మాట్లాడుతూ ఈరోజు ఉత్తర తెలంగాణ జిల్లాలకు శుభసూచికమన్నారు.
రానున్న రోజుల్లో తెలంగాణలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏ విధంగా కేంద్రం అండగా ఉంటుందో తెలియజేస్తుందని అన్నారు. వరంగల్ గడ్డ మీద రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీకి శ్రీకారం చుట్టామని చెప్పారు. తెలంగాణకు బీజేపీ భరోసాగా ఉన్నామని చెప్పేందుకే మోదీ వచ్చారని తెలిపారు.
కేసీఆర్ను గద్దె దించాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. హామీలిచ్చి ప్రజల కళ్లల్లో మట్టికొట్టిన కేసీఆర్ను ఓడించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బంగారు తెలంగాణ పేరిట కేసీఆర్ మాటలు చెప్పారని.. ఆ బంగారు తెలంగాణ చేతల్లో చేసి చూపించే సత్తా బీజేపీకి మాత్రమే ఉందని ఈటల రాజేందర్ అన్నారు.