విధాత, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలకు బ్రేక్ పడింది. ఉపాధ్యాయ బదిలీలపై మార్చి 14వ తేదీ వరకు తెలంగాణ హైకోర్టు స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నాన్ స్పౌజ్ టీచర్ల అసోసియేషన్ పిటిషన్పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. టీచర్ల బదిలీల నిబంధనలపై హైకోర్టును ఆశ్రయించిన నాన్ స్పౌజ్ టీచర్లు.. బదిలీల నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఉద్యోగ దంపతులు, యూనియన్ నేతలకు అదనపు పాయింట్లపై నాన్ స్పౌజ్ టీచర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇదిలా ఉండగా.. ఇటీవల ఉపాధ్యాయుల బదిలీకి సంబంధించి కేసీఆర్ సర్కారు నిర్ణయం తీసుకున్న విషయం విధితమే.
జీవో 317తో బదిలీ అయిన టీచర్లకు పూర్వ జిల్లా సర్వీసును సైతం పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ నెల 12 నుంచి 14 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. ఈ క్రమంలో బదిలీ ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. రాష్ట్రంలో కొద్ది రోజులుగా ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ కొనసాగుతున్నది.
ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లు, లాంగ్వేజీ పండిట్లకు బదిలీ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే, నిబంధనల్లో కనీసం ఒకేచోట రెండేళ్లు పనిచేసిన వారు మాత్రమే బదిలీకి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులుగా ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇటీవల ఉమ్మడి జిల్లాల నుంచి కొత్త జిల్లాలకు జీవో 317 ప్రకారం బదిలీ అయిన వారికి రెండేళ్ల సర్వీసు పూర్తి కాలేదు. దాంతో తాము ఉమ్మడి జిల్లా నుంచి కొత్త జిల్లాకు వచ్చామని, ఉమ్మడి జిల్లాలోని సర్వీసును కూడా పరిగణనలోకి తీసుకోవాలంటూ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో చివరకు హైకోర్టును ఆశ్రయించారు.
ఇదిలా ఉండగా.. ఇప్పటికే 60వేల మంది ఉపాధ్యాయులు బదిలీకి దరఖాస్తు చేసుకున్నారు. ఇవాళ్టితో స్పౌజ్ కేటగిరి దరఖాస్తుల ప్రక్రియ సైతం ముగిసింది. దరఖాస్తుల పరిశీలన, ఉపాధ్యాయుల కేటాయింపునకు విద్యాశాఖ సన్నద్ధమవుతున్న నేపత్యంలో హైకోర్టు స్టే విధించడంతో బదిలీల ప్రక్రియ నిలిచిపోనున్నది. మార్చి 14న మరోసారి హైకోర్టు బదిలీలపై విచారణ జరుపనున్నది.